AP Health Department Anger: ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలు మనోభావాలతో ఆడుకుంటూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. ముఖ్యంగా సిజేరియన్ ప్రసవాల విషయంలో దారణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం. రాష్ట్రంలో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు జరగడంపై ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమైన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించారు.
ప్రాణాంతకంగా మారుతున్న సిజేరియన్లు: ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్ ప్రసవాలు చేస్తే ఆరోగ్య శ్రీ గుర్తింపును రద్దు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు హెచ్చరించారు. సిజేరియన్ ఆపరేషన్ల విషయంలో సమాజానికి అన్యాయం చేయొద్దని ఆయన ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులకు సూచించారు. సహజ సిద్ధమైన రీతిలో ప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రాణాంతకంగా మారుతున్న సిజేరియన్ల జోలికి పోవద్దని ఆయన స్పష్టం చేశారు. గైనకాలజిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమైన ఆయన.. వందశాతం సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బును సంపాదించాలనే ధ్యేయంగా ఆసుపత్రుల్ని నడపొద్దని హితవు పలికారు.