Protest Against GO No 1: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్-1 రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం రాష్ట్రంలో పలు చోట్ల పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జీవో నెంబర్-1పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ పోతే వైసీపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి సీపీఐ పార్టీ ఎక్కడికి అక్కడ ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతుందని హెచ్చరించారు.
జీవో నెం.1ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. చీకటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జీవో కాగితాలను దహనం చేశారు. గుంతకల్లు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి మాట్లాడుతూ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభల్లో కార్యకర్తలు చనిపోవడం అన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితి అని, అయితే జరిగిన దుర్ఘటన సాకుగా చూపి జీవో నెంబర్-1 తేవడం అన్యాయమన్నారు. అంతేకాకుండా మీడియా ముఖంగా ఎప్పుడు నాకు పత్రికలు లేవు అని చెప్పుకునే ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బందికి ప్రతినెల 200 రూపాయలు ఇస్తూ కేవలం సాక్షి పేపర్ని తీసుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ విధంగా ప్రతినెల రాష్ట్ర ప్రజాధనం రూ.96 కోట్లు వృధాగా పోతుందని తెలిపారు.