ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan on Nandyal Development: నంద్యాల అభివృద్ధిపై వరాలు కురిపించారు.. అమలు మరిచారు - నంద్యాల అభివృద్ధిపై సీఎం జగన్

CM Jagan on Nandyal Development: ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక పులివెందులపై ఎంత శ్రద్ధ పెడతానో అంతే శ్రద్ధ నంద్యాలపైనా చూపిస్తానన్నారు. పట్టణ అభివృద్ధిని నాకొదిలేయండి.. పరుగులు పెట్టిస్తా.. ఆదర్శంగా తీర్చిదిద్ది గుర్తింపు తెస్తానంటూ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఊదరగొట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ హామీలు గుప్పించారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేయిస్తానని సీఎం అయ్యాక మరో మాట ఇచ్చారు. వరాలు అయితే కురిపించారు కానీ.. వాటిని అమలును మాత్రం పూర్తిగా విస్మరించారు.

CM Jagan assurances
సీఎం జగన్ హామీల ఆర్భాటం

By

Published : Jul 23, 2023, 12:20 PM IST

సీఎం జగన్ హామీల ఆర్భాటం

CM Jagan on Nandyal Development: ఇదీ గతేడాది ఏప్రిల్‌ 7న బహిరంగ సభలో.. నంద్యాల నియోజకవర్గంపై సీఎం జగన్‌ కురిపించిన హామీల వర్షం. కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు సాగక పోగా.. మౌలిక వసతులూ కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ రోడ్డుకు 100 కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల శాఖ పంపిన ప్రతిపాదన ప్రభుత్వం వద్దే ఇంకా పెండింగ్‌లో ఉంది.

పేదలకు ఉచితంగా ఇళ్లను కట్టించి రిజిస్టర్ చేసిస్తామని ఎన్నో సార్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మినహా..ఇళ్ల నిర్మాణంపై దృష్టి నిలపలేదు. టీడీపీ హయాంలో ఎస్సార్బీసీ కాలనీలో 50 ఎకరాల్లో 890 కోట్ల రూపాయలతో టిడ్కో గృహాలు నిర్మించారు. అలాగే వైఎస్సార్ నగర్, అయ్యలూరు మెట్ట వద్ద పేదలకు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. కానీ లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం వాటినీ ఇప్పటికీ అప్పగించలేదు.

నంద్యాలలో పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న పద్మావతినగర్ మురుగునీటి చెరువుగా మారుతోంది. పాత పట్టణంలో మద్దిలేరు వాగు విస్తరణ, కరకట్టల నిర్మాణం ఊసే లేదు. తరచూ ఈ ప్రాంతం ముంపునకు గురవుతోంది. నంద్యాల చిన్న చెరువును ట్యాంక్ బండ్​లా అభివృద్ధి చేస్తామని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పినా ఆ దిశగా చర్యలు లేవు. పట్టణంలో మురుగునీటి కాలువల నిర్మాణాన్నీ చేపట్టలేదు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదన గురించి పట్టించుకునే వారు కరవయ్యారు.

బొమ్మలసత్రం నుంచి నూనెపల్లె ఉపరితల వంతెన వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మూడేళ్ల కిందట 13కోట్ల 40 లక్షల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగా కిలోమీటరు పొడవున మురుగు కాలువల నిర్మాణాన్ని ప్రారంభించినా.. అవి 6 నెలలుగా నిలిచిపోయాయి. కుందూ నదిపై వంతెన నిర్మాణ పనులు టీడీపీ హయాంలో ప్రారంభమైనా.. వైసీపీ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ఆగిపోయాయి.

ప్రతి ఇంటికీ రక్షిత నీటిని సరఫరా చేస్తామని ఉప ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నంద్యాలలో రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. టీడీపీ హయాంలో అమృత్ పథకం కింద వెలుగోడు రిజర్వాయరు నుంచి నేరుగా నంద్యాలకు తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారే సమయానికి 30 శాతం పనులు మిగిలి ఉన్నాయి. వైకాపా వచ్చి నాలుగేళ్లు దాటినా ఆ పనులు పూర్తి కాలేదు.

నంద్యాలలో వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చినా ఈ నాలుగేళ్లలో దాని ఊసే లేదు. మరో వైపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఏడాది కిందట ఇక్కడే జిల్లా కలెక్టరేట్​ను ఏర్పాటు చేశారు. ఆర్ఎఆర్ఎస్ భూములు 50 ఎకరాలను వైద్య కళాశాలకు బదలాయించారు. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరిస్తామని హామీ అటకెక్కింది. జిల్లాలో 2 లక్షల 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికీ చివరి భూములకు నీరు సరిగ్గా అందని పరిస్థితి. కేసీ కెనాల్ తూము ఏర్పాటు చేయకపోవడంతో గోస్పాడు మండలం జిల్లెల నుంచి పసురపాడు వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details