ఎప్పుడో పూర్తికావాల్సిన వంతెనల నిర్మాణాలు ఆగిపోవడం.. కర్నూలు ప్రజల్ని తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కష్టాల్ని తగ్గించేందుకు చేపట్టిన నిర్మాణాలు నత్తనడకన సాగుతూ.. మరింత రద్దీ పెంచుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు... సర్కారు మారక పడకేశాయి. రాజ్విహార్ కూడలిలో రద్దీ తగ్గించడంతో పాటు.. కొత్త బస్టాండ్ నుంచి నేరుగా కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు హంద్రీ నదిపై... ఆనంద్ టాకీస్ వద్ద మూడేళ్ల క్రితం వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారాక.... బిల్లులు చెల్లించకపోవడంతో.. గుత్తేదారు పనులు ఆపేశారు.
గుత్తి పెట్రోల్ బంకు నుంచి బిర్లాగేట్ వరకు 20 కోట్ల రూపాయలతో చేపట్టిన పైవంతెన పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పనుల కారణంగా ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వెంకటరమణ కాలనీ సమీపంలో.. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనుల్లోనూ రెండేళ్ల నుంచి పురోగతి లేదు. దుమ్ము-ధూళితో వాహనదారులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలూ అధికమయ్యాయి.