ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sports Authority of AP: క్రీడలకు రుసుం తీసుకోవాలని నిర్ణయం... క్రీడాకారులకు శాపంగా మారిన శాప్ నిర్ణయం ! - డబ్బులు చెల్లించి ఆటలు ఆడుకోవాలంటున్న శాప్‌

Sports Authority of AP: విద్యార్థులు, యువతీ యువకుల్లోని ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరికల్లా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం.. క్రీడాకారులనే ఆదాయ వనరులుగా మార్చుకుంటోంది. ప్రతి క్రీడాకారుడు.. డబ్బులు చెల్లించి ఆటలు ఆడుకోవాలన్న కొత్త కార్యక్రమానికి తెరతీసింది. ఈ విధానానికి పే అండ్ ప్లే అనే అని నామకరణం చేసింది.

Sports Authority of AP
Sports Authority of AP

By

Published : Dec 27, 2021, 11:49 AM IST

డబ్బులు చెల్లించి ఆటలు ఆడుకోవాలంటున్న శాప్‌

Pay and play policy in AP Sports Authority: రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ-శాప్ పరిధిలో కర్నూలు జిల్లాలో గ్రామీణ క్రీడా వికాస కేంద్రాలు , ఇండోర్‌ స్టేడియాలు 6 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన క్రీడలు 31 వరకు ఉన్నాయి. కొలువుల్లో 2 శాతం రిజర్వేషన్‌ కోటా ఉండటంతో ఆటలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఏటా 10 వేల మంది జిల్లా, రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు హాజరవుతున్నారు. ఇందులో 100 మందికిపైగా ఏపీ తరఫున జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి చోట పే అండ్‌ ప్లే విధానం తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


క్రీడలకు రుసుం తీసుకోవాలని నిర్ణయిం

ఇప్పటి వరకు ఇండోర్‌ స్టేడియాల్లో అడ్మిషన్‌, నెలవారీ ఫీజులు తీసుకొంటున్నారు. ఈత కొలను, షటిల్‌, యోగా, జిమ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలకు నెలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. జీవో సంఖ్య 20 ప్రకారం ఫీజులు తీసుకొంటున్నా వాటిని మరింత పెంచాలని... జిల్లా శాప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల వద్ద పెద్దపెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు వేశారు. అవుట్‌డోర్‌ క్రీడలకూ రుసుము తీసుకోవాలని నిర్ణయించారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌ క్రీడలకు సంబంధించి ఒక్కో ఆటగాడు నెలకు 500 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అండర్‌-14 విభాగం క్రీడాకారులకు ఓ ధర, ఆపై వయసు విభాగాల వారికి మరో ధర నిర్ణయించారు.

ప్రతి నెలా వసూలు లక్ష్యాలు
కర్నూలు జిల్లాలో 22 మంది ఒప్పంద కోచ్‌లు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెలా లక్ష్యాలు విధించారు. గ్రామీణ పరిధిలో కోచ్‌లకు 10వేలు, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పరిధిలో 25 వేలు వసూలు చేసేలా లక్ష్యాలు పెట్టారు. క్రీడాకారులు లేకపోతే... శిక్షకులే పాఠశాలలకు వెళ్లి... క్రీడల్లో చేర్పించి... వారినుంచి డబ్బులు వసూలు చేయాలి. మొత్తంగా ప్రతి జిల్లా నుంచి శాప్ కు ఏడాదికి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై శిక్షకులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ విధానంలో మైదానాలకు దూరం
పేద, మధ్యతరగతి యువతీ యువకులకు క్రీడలపట్ల ఆసక్తి కలిగించి... మౌలిక వసతులు సహా హాస్టల్ వసతి కల్పించి తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం... పే అండ్‌ ‌ప్లే విధానంతో క్రీడాకారులను మైదానాలకు దూరం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి..:Heavy electricity bills for schools: ప్రభుత్వ పాఠశాలలకు గుదిబండగా 'విద్యుత్తు బిల్లులు'

ABOUT THE AUTHOR

...view details