ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి

కర్నూలు జిల్లాలో రైతులు పండించిన ఉల్లిని అమ్ముకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా... ఆ ఆనందం ఎంతోసేపు నిలవటం లేదు. కరోనా కారణంగా కర్నూలు ఉల్లి మార్కెట్ చాలా కాలం తర్వాత ప్రారంభించినా... సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.

onion rates have been decreased due to corona in kurnool market
గిట్టుబాటు ధర కూడా పలకక రైతులను కంటతడి పెట్టిస్తోన్న ఉల్లి

By

Published : Aug 13, 2020, 11:58 PM IST

కర్నూలు జిల్లాలో ఏడాది పొడవునా ఉల్లిని సాగు చేస్తారు. కరోనా కారణంగా ఏప్రిల్ నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్ ను మూసివేశారు. గతంలో రైతులు పండించిన పంటను విక్రయించటం చాలా కష్టతరంగా మారింది. కొనేవారు లేక, ఒకవేళ ఎవరైనా వ్యాపారులు వచ్చినా క్వింటాలు ఉల్లి రూ.400 నుంచి 500 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతుల పరిస్థితి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ దృష్టికి రావటంతో... వెంటనే మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈనెల 8వ తేదీ నుంచి కనీస మద్దతు ధర రూ.770గా నిర్ణయించారు. జిల్లాలోని గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోసిగి, డోన్ మార్కెట్లలో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలోని 7 వ్యవసాయ మార్కెట్లలో సాధారణ రకం ఉల్లిని రూ.300 నుంచి 500 వరకు, నాణ్యమైన ఉల్లిని రూ.770 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి కింద రూ.50 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా నాలుగు నెలల తర్వాత కర్నూలు వ్యవసాయ మార్కెట్ ను ఆగస్టు12న అధికారులు తెరిచారు. మొదటి రోజు 14 వందల క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. ప్రైవేటు వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు కనిష్ఠంగా రూ.210, గరిష్ఠంగా రూ.910 పలికింది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. కరోనా కారణంగా కూలీల కొరత వేధిస్తోంది. తరచుగా వర్షాలు కురుస్తుండటంతో... పంటను ఆరబెట్టుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా.. ఉల్లి నాణ్యత లోపించిందని వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు ఎక్కవవుతుండటంతో... వారంలో సోమ, బుధ, శనివారాలు మాత్రమే ఉల్లి మార్కెట్ ను తెరవనున్నట్లు కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు.

గతేడాది ఉల్లికి మంచి ధరలు పలికాయి. క్వింటాలు ఉల్లి రూ.6 వేల వరకు పలికింది. తమకు ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం పెట్టుబడులు రావాలంటే... రూ.2 వేల పలకాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాన్ని నమ్మండి.. ప్రతిపక్షాన్ని కాదు: బొత్స

ABOUT THE AUTHOR

...view details