Water problem: కర్నూలు జిల్లాలో ఏర్పాటైన ఓ భారీ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా తంగడంచెలో 623 ఎకరాలు జైన్ ఇరిగేషన్ సిస్టమ్ పరిశ్రమకు కేటాయించారు. తొలుత రూ.340 కోట్లతో పైపులు, డ్రిప్ పైపుల తయారీతో పాటు పండ్ల ప్రొసెసింగ్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ముచ్చుమర్రి నుంచి తంగడంచె వరకు 17 కి.మీ. పైపులైను ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
తంగడంచెను సీడ్ హబ్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో, సీడ్ హబ్, జైన్ ఇరిగేషన్కు కలిపి నీటి సౌకర్యం కల్పించేలా రూ.18 కోట్లతో 2017-18లో మొదట డీపీఆర్ సిద్ధం చేశారు. తర్వాత జైన్ ఇరిగేషన్ పరిశ్రమకు ఒక్కదానికే రూ.7 కోట్లతో డీపీఆర్ తయారు చేశారు. అవసరమైన పైపుల సరఫరాకు జైన్ ఇరిగేషన్ ముందుకు రాగా, పంపుహౌస్, మోటార్లకు రూ.3 కోట్లు స్టేట్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నీటి సౌకర్యం కల్పన కలగా మారింది.
సంస్థ ప్రతినిధులు ప్రస్తుత ప్రభుత్వానికి, ఏపీఐఐసీ, జిల్లా అధికారులకు కంపెనీ ప్రతినిధులు అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. నిత్యం 3 క్యూసెక్కుల నీరు అవసరమని, నీటి సౌకర్యం కల్పిస్తే 8 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పైగా ఎప్పుడు నీరు ప్రవహిస్తుందో తెలియని కేసీ కెనాల్ ద్వారా తాత్కాలికంగా నీటిని ఉపయోగించుకోవాలని చెప్పి చేతులు దులుపుకొంది.