కర్నూలు జిల్లా నందికొట్కూరు వాసులు రహదారుల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నందికొట్కూరు ప్రధాన రహదారిని ఇరువైపులా 20 అడుగులు వెడల్పు చేసేందుకు 2017లో శ్రీకారం చుట్టూరు. అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి 2 కి.మీ మేర రహదారి వెంబడి ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. విస్తరణలో కోల్పోయిన దుకాణాలు, తిరిగి నిర్మించుకుంటే.. మున్సిపాలిటీ ఎటువంటి రుసం వసూలు చేయదని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
సుమారు 800 దుకాణాలు కూల్చి, విస్తరణ చేపట్టారు. జాతీయ రహదారి అధికారులు రోడ్లు వేయాల్సిన సమయంలో కొందరు పరిహారం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కారు. దీనివల్ల నాలుగేళ్లుగా రహదారులు, డ్రైనేజీలు, డివైడర్ల ఏర్పాటు జరగలేదు.
డివైడర్ల ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు కేటాయించామంటూ స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ప్రకటించినా... నిర్మాణ పనులు ఏ మాత్రం ముందుకు కదల్లేదు. కొత్త బస్టాండ్ నుంచి జమ్మిచెట్టు వరకు ఈ పనులు చేపట్టేందుకు నిర్ణయించినా ఆ దిశగా అడుగులు పడలేదు.