కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జలాశయానికి ఎగువన ప్రాజెక్టుల నుంచి 3 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల.. 39 గేట్లు తెరిచి 3 లక్షల 52 వేల 221 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి.. కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో మొత్తం 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం 4లక్షల 17వేల 582 క్యూసెక్కుల వరద వస్తోంది. 3లక్షల 45 వేల 899 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
- నిండుకుండలా సాగర్
శ్రీశైలం నుంచి పరుగులు తీస్తున్న వరద ప్రవాహం.. నాగార్జునసాగర్కు పోటెత్తుతోంది. ప్రస్తుతం లక్షా 69 వేల 620 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. 30 వేల 342 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను... 271.37 టీఎంసీల నిల్వఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరుకుంటే... గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు... నాగార్జున సాగర్ అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు నదిలోకి దిగవద్దని, పర్యటకులు సైతం నది దగ్గరకు రావొద్దని.. స్పష్టం చేశారు.
- భద్రాద్రిలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక