తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మట్టి వినాయకుడు నిమజ్జనం అట్టహాసంగా జరుగుతోంది. కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున శ్రీ లక్ష్మీనరసింహ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అరవై ఐదు అడుగుల భారీ మట్టి వినాయకున్ని ఏర్పాటు చేశారు. దీని నిమజ్జనం కార్యక్రమం కోలాహలంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్త మండలి సభ్యులు హోమం, అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అనంతరం లడ్డూ వేలం వేస్తారు. సాయంత్రం నిమజ్జనం చేస్తారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్ సహాయంతో విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేయనున్నారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి ఆలయంలో పదోరోజు నవధాన్య నారికేళ లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గణపతి పూజ అనంతరం నారికేళ నవధాన్యాలతో లక్ష్మి పూజ నిర్వహించి దీపార్చన చేశారు. సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు వేద పఠనం చేసి భక్తి గీతాలు ఆలపించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఎల్లం కూడలిలో ఏర్పాటు చేసిన మూడు అడుగుల భారీ గణనాథుని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బల్ల వ్యాసాలు, కోయ నృత్యాలు, నాగిని డాన్స్లు, కాంగో డాన్సులు, సాము గరిడీలతో గణపయ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ప్రధాన రహదారి మీదుగా పట్టణ పుర వీధులలో బొజ్జ గణపయ్యని ఊరేగింపుగా తీసుకువెళ్లి నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొనగా ఎలాంటి సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి ప్రసాద్ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.