Women cricketer: హోటల్లో పనిచేస్తూ మధ్యమధ్యలో ఎదురుగా ఉన్న టీవీ షోరూం తలుపు పక్క నిలబడి క్రికెట్ చూసేవారట నాన్న. అదంటే అంత పిచ్చి ఆయనకు. కపిల్, సచిన్ల ఆటంటే ఇంకా! మేం ఇద్దరమ్మాయిలం, ఒక అబ్బాయి. అమ్మాయిల్లో ఒకరిని క్రికెటర్గా చూడాలని నాన్న కోరిక. కానీ.. బంధువులు, స్నేహితులు ‘ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకు? పదో తరగతి వరకు చదివించి పెళ్లి చెయ్యి’ అనేవారు. నాన్న అవేమీ పట్టించుకోలేదు. నేను అండర్-19 కెప్టెన్గా రాణించి, పత్రికల్లో నా పేరు వచ్చినప్పుడు నాన్న నమ్మకంపై అందరికీ గురి ఏర్పడింది.
మాది కర్నూలు జిల్లా కోడుమూరు. అమ్మ లక్ష్మి, నాన్న వెంకటేశ్. నాన్న స్నేహితుడు డాక్టర్ రఘురాంరెడ్డి క్రికెట్ కోచింగ్ ఇస్తుంటారు. ఆయన మాకు శిక్షణనివ్వడానికి ముందుకొచ్చారు. అక్కకి చదువంటే ఆసక్తి. తను వెళ్లనంది. నాకేమో చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఇష్టం.. దీంతో నేను వెళతానన్నా. కిట్, షూ సహా అన్నీ శిక్షకులే సమకూర్చారు. ‘క్రికెట్ చాలా కష్టమైన ఆట. ఆడపిల్లలు అసలే ఆడలేరు. సమయం వృథా చేసుకోకు’ అన్నారు చాలామంది. వాళ్ల మాటలు నాలో పట్టుదలను నింపాయి. రోజూ 5-6 గంటలు సాధన చేసేదాన్ని. ఆ శ్రమ ఫలితమే 2009లో రాష్ట్ర జట్టులో స్థానం.
క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలు కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. కష్టానికి భయపడొద్దు. ముందు మనల్ని మనం నమ్మాలి. అప్పుడు క్రికెట్టే కాదు దేనిలోనైనా రాణిస్తాం.
క్రికెట్లో రాణిస్తున్న నీరుగట్టి అనూష
రంజీ జట్టుకు కెప్టెన్..
ఒక అండర్-19 మ్యాచ్లో తమిళనాడుపై 169 పరుగులు చేసి ఆంధ్రా జట్టు గెలుపులో కీలక భాగస్వామినయ్యా. అండర్-23లో హైదరాబాద్, గోవా జట్లపై సెంచరీలు సాధించా. అండర్-19, 23 జట్లకు కెప్టెన్గానూ వ్యవహరించా. అండర్-23 ట్వంటీ20 ఛాలెంజర్స్ ట్రోఫీ నా సారథ్యంలోనే గెలుచుకున్నాం. రంజీ మ్యాచ్ల్లో హరియాణాపై 75 పరుగులు సాధించి జట్టు గెలుపునకు కృషి చేశా. అర్ధశతకాలు పదికిపైగానే చేశా. గతేడాది వరకూ రంజీ జట్టుకు కెప్టెన్గానూ ఉన్నా. నా నేతృత్వంలో రంజీల్లో రెండోస్థానంలో నిలిచాం.