అధికారుల నిర్వాకం... పాఠశాల భవనంలో సచివాలయం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 25 గదులు అవసరం కాగా ప్రస్తుతం 22 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే పాఠశాల కోసం 3 గదులు నిర్మించారు. వాటిలో ఐఐటీ తరగతులు నిర్వహించేవారు. ఈ గదులకు ఆనుకునే బాలికల మరుగుదొడ్లను నిర్మించారు.
సచివాలయంగా మార్చేశారు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొత్తగా వార్డు, గ్రామ సచివాలయాల కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా.. పురపాలక కార్యాలయ ఆవరణలోని మున్సిపల్ హైస్కూల్ భవనంపై అధికారులు కన్నేశారు. కొత్తగా నిర్మించిన మూడు గదులను సచివాలయ భవనంగా మార్చేశారు. అవి అవసరం ఉందని చెబుతున్నా వినకుండా తీసుకున్నట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
బాలికలకు తీవ్ర ఇబ్బందులు
ఇప్పటికే పాఠశాలలో ఉన్న పాత గదులు సరిపోవటం లేదు. కొత్త గదులు అధికారులు లాక్కున్నారు. దీని వల్ల మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది బియ్యం, పప్పులు, వంట సామాగ్రి పెట్టుకోవటానికి సైతం అవకాశం లేకుండా పోయింది. సచివాలయం కోసం తీసుకున్న గదుల ముందు నుంచే మరుగుదొడ్డికి వెళ్లాల్సిరావటంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు పట్టణంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో సచివాలయ భవనాల కోసం గదులు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అధికారులు... ఇలా వాటికి కేటాయించిన భవనాలనే లాక్కోవటం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
ఇదీ చూడండి:
మంత్రి అనిల్కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత