YSRCP demolished poor man shop: 'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్టుంది.. ఏపీలో తాజా పరిస్థితి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సంధించినట్టుగా.. ఓ నిరుపేద కుటుంబంపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. అధికారులను పురమాయించి వారి జీవనాధారాన్ని తుంచివేసింది. ఊహించని ఈ ఘటనతో వీధి పాలైన ఆ కుటుంబం.. అసలు తాము చేసిన తప్పేమిటో తెలియక కన్నీరు మున్నీరవుతోంది. ఏమైంది..? అని ఎవరైనా కదిలిస్తే చాలు.. సుడులు తిరుగుతున్న కన్నీళ్లను పంటి బిగువన దిగమింగుకుంటూ కుమిలిపోతోంది. కర్నూలులో నారా లోకేశ్ పాదయాత్రకు హారతివ్వడమే ఆ కుటుంబం చేసిన తప్పిదం.. అధికారుల చర్యకు అదే కారణమని తెలుస్తోంది. జరిగిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూల్చడం తప్ప నిర్మించడం తెలియని జగన్కు జనం బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ పడగొడితే తాము నిలబెడతామని స్పష్టం చేశారు.
కార్పొరేటర్ అదేశాలతో.. టీడీపీ యువనేత నారా లోకేశ్కు స్వాగతం పలికాడనే ఉద్దేశంతో కర్నూలులో వైఎస్సార్సీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పేదోడి దుకాణాన్ని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. నగరంలోని 49వ వార్డు ప్రకాష్ నగర్కు చెందిన రాము కుటుంబం... గత కొన్నేళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. యువ గళం పాదయాత్రలో భాగంగా కర్నూలుకు వచ్చిన నారా లోకేశ్కు రాము కుటుంబం హారతి ఇచ్చి స్వాగతం పలికింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ నేతలు రాముపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. కార్పొరేటర్ కృష్ణకాంత్ ఆదేశాలతో.. మున్సిపల్ సిబ్బంది కూరగాయల దుకాణాన్ని కూల్చివేశారు.
Lokesh Fire on YSRCP: వైఎస్సార్సీపీ కాలకేయులు..కర్నూలులో రాము కూరగాయల దుకాణాన్ని వైఎస్సార్సీపీ కాలకేయులు ధ్వంసం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ పడగొడితే.. తాము నిలబెడతామని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో హారతిచ్చారని చిరువ్యాపారిపై కక్ష సాధింపా అంటూ మండిపడ్డారు. రాము కొత్త షాపు నిర్మాణం, పెట్టుబడికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీబీఎన్ అభివృద్ధికి చిహ్నమైన భవనాలు కడితే.. జగన్ రెడ్డి విధ్వంసపు ఆలోచనలతో వాటిని కూలగొడుతున్నాడని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే జగన్ ప్రాణాలు తీయిస్తున్నాడని దుయ్యబట్టారు.
జగన్ రెడ్డి కక్ష.. వైఎస్సార్సీపీ ఫ్యాక్షన్ కత్తివేట్లకు కన్నవాళ్లని కోల్పోయిన పిల్లల్ని తెలుగుదేశం చదివించి ప్రయోజకుల్ని చేస్తోందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి కక్ష కడితే సామాన్యుల ఉపాధినిచ్చే దుకాణాలను కూలగొడుతున్నాడని లోకేశ్ దుయ్యబట్టారు. తాము అవే దుకాణాల్ని తిరిగి నిర్మించి, చేయూతనందించి వారి బతుకులని నిలబెడతామన్నారు. వైఎస్సార్సీపీ విధ్వంసం, తెలుగుదేశం నిర్మాణ విధానాలివేనని తేల్చిచెప్పారు. ఇటీవల కర్నూలులో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రకాష్ నగర్ 49 వ వార్డుకి చెందిన రాము కుటుంబంతో కలిసి లోకేశ్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. లోకేశ్ కి స్వాగతం పలికారని కక్ష కట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కృష్ణ కాంత్.. 40 ఏళ్లుగా రాము ఉపాధి పొందుతోన్న కూరగాయల దుకాణాన్ని కూల్చివేశారని లోకేశ్ మండిపడ్డారు.
కర్నూలులో దుకాణం కూల్చివేయించిన వైఎస్సార్సీపీ నేతలు