ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2019, 6:49 AM IST

ETV Bharat / state

కంజారా కన్ను పడితే.. కంటైనర్ ఖాళీ..!

కంటైనర్లనే లక్ష్యంగా చేసుకుంటారు. ద్విచక్రవాహనాలతో వెంబడిస్తారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో విలువైన సామగ్రిని దోచేస్తారు. ఇలాంటి ఎన్నో దోపిడీలకు పాల్పడి నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది కంజారా ముఠా. కర్నూలు పోలీసులు ఈ ముఠాను వెంబడించి... పట్టుకున్న తీరు హాలీవుడ్‌ చిత్రానికి తీసిపోదు.

Highway container thieves caught by kurnool police
కంజారా కన్ను పడితే.. కంటైనర్ ఖాళీ..!

కంజారా కన్ను పడితే.. కంటైనర్ ఖాళీ..!

కంజారా ముఠా.. నాలుగు రాష్ట్రాల పోలీసులకే సవాళ్లు విసిరిన ఓ కరుగుగట్టిన దొంగల గుంపు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా నేరాల తీరే వేరు. జాతీయ రహదారులపై వేగంగా వెళ్తున్న కొరియర్‌ కార్గో కంటైనర్లు, పార్శిల్‌ సర్వీసు వ్యాన్లు, ట్రక్కులే వీరి లక్ష్యం. వాటిని ద్విచక్రవాహనాలతో వెంబడించి.. పదునైన ఆయుధాలతో తాళాలను తొలగిస్తారు. వాహనంలోకి చొరబడి వస్తువులను రోడ్ల పక్కనే విసిరేస్తారు. ఈ వాహనాలను వెంబడించే 2 లారీల్లోని మరో బృందం వాటిని సేకరిస్తారు. అలా దొంగిలించిన వస్తువులను మధ్యప్రదేశ్‌కు తరలించి విక్రయిస్తారు. ఎవరైనా అడ్డొస్తే అంతమొందించేందుకు సైతం వెనుకాడరు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు చూస్తే ఒళ్లు జలదరించక మానదు. కొంతకాలంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతూ నాలుగు రాష్ట్రాల పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతోంది ఈ ముఠా.

దోపిడీ ఓ చోట... ఫిర్యాదు మరోచోట

చోరీ ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో తెలియని కంటైనర్‌ డ్రైవర్లు.... మరెక్కడో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. దీని వల్ల వారికి దొంగలను పట్టుకోవడం కష్టమైపోతోంది. దీనిని ఆసరాగా చేసుకుంటూ కంజారా ముఠా రెచ్చిపోతోంది. ఒక దొంగతనం చేశాక స్వస్థలాలకు వెళ్లి కొద్ది రోజుల తర్వాత మరో దోపిడీకి పథకం రచిస్తారు. ఈ దోపిడీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

సవాల్​గా తీసుకున్న పోలీసులు

కంజారా ముఠాలో ఓ ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్న తీరు ప్రశంసలందుకుంటోంది. నంద్యాల, ఆళ్లగడ్డ పరిధిలో ఈ నెల 4,5,6 తేదీల్లో జాతీయ రహదారిపై మూడు చోరీలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 26న ఇదే తరహాలో డోన్‌ రహదారిపై మరో చోరీ జరిగింది. ఈ అంశాన్ని సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ ఫకీరప్ప వంద మంది పోలీసుల బృందంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రహదారిపై కాపు కాసి... నేరానికి పాల్పడుతుండగా వెంబడించారు. దొంగలు చిక్కినట్లే చిక్కి పాణ్యం వద్ద పొలాల్లోకి పారిపోయారు. స్థానిక చెంచుల సహకారంతో జల్లెడ పట్టిన పోలీసులు ముగ్గురు ముఠాసభ్యులను పట్టుకున్నారు. 2 లారీలు, 85 మొబైళ్లు, 16 చీరలు, ఓ ఐరన్‌ కట్టర్‌ సహా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మిగిలిన ముఠా సభ్యుల సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి :

నమ్మిస్తారు... చిటికెలో ట్రాక్టర్ మాయం చేస్తారు..!

ABOUT THE AUTHOR

...view details