ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2021, 11:03 PM IST

ETV Bharat / state

బ్యాంకులో బంగారం మాయం... ఇంటి దొంగే సూత్రధారి

బ్యాంకులో ఖాతాదారుల బంగారం అపహరించిన కేసులో ఇంటి దొంగలే సూత్రధారులని తేలింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. పొరుగు సేవల కింద అటెండర్​గా పనిచేస్తున్న కాశీ విశ్వనాథ్​.. ఆభరణాలను దొంగిలించినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. రూ. 8 లక్షల నగదుతో పాటు 1,305 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

bank gold missing case solved, uyyalavada gold missing in bank sovled
బ్యాంకులో బంగారం మాయం కేసు ఛేదించిన పోలీసులు, ఉయ్యాలవాడ బ్యాంకులో బంగారం కేసు ఛేదన

కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బంగారం మాయమైన ఘటనలో.. పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే చోరీకి కారణమైన నిందితులను అరెస్టు చేశారు. బ్యాంకులో పొరుగు సేవల కింద అటెండర్​గా పని చేస్తున్న కాశీ విశ్వనాథ్​ను సూత్రధారిగా నిర్ధరించారు. పోలీసులు క్షేత్రస్థాయి విచారణలో భాగంగా.. విశ్వనాథ్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

దోపిడీ చేశారిలా...

స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులను కాశీ విశ్వనాథ్ దొంగిలించి, మరొకటి తయారు చేయించి.. వాటి సహాయంతో ఈనెల 11న ఖాతాదారుల ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు బయట తన స్నేహితుడు సుబ్రహ్మణ్యంను కాపలా ఉంచి.. అనుమానం రాకుండా బ్యాంకులో వస్తువులు దోపిడీ చేశారన్నారు. మిత్రుడి ఇంటిలో దాచిపెట్టిన బంగారంతో పాటు కాశీ విశ్వనాథ్, సుబ్రమణ్యం సహా కొన్ని ఆభరణాలను కొనుగోలు చేసిన నంద్యాలకు చెందిన కిషన్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల నగదు, 1305 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చోరీకి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమూ కారణమేనని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు.

ఇదీ చదవండి:ట్రక్కు కిందపడి యువకుడు బలవన్మరణం

అసలేం జరిగింది?

ఈనెల 17వ తేదీన ఆభరణాలు తనఖా పెట్టిన ఓ ఖాతాదారుడు.. తన బంగారాన్ని విడిపించుకునేందుకు బ్యాంకుకు వచ్చాడు. స్ట్రాంగ్ రూంలో అతనికి సంబంధించిన వస్తువులు కనిపించలేదు. బ్యాంకు మేనేజర్ లక్ష్మీప్రసాద్ ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించగా.. మొత్తం 18 మందికి చెందిన దాదాపు 1,500 గ్రాముల బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై వెంటనే ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్​లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ సుబ్బరాయుడు విచారణ ప్రారంభించారు. రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:

టైరు పగిలి ఆర్టీసీ బస్సు బోల్తా... ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details