Anganwadi Workers concern: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని జిల్లాల్లోనూ కదం తొక్కారు. పోలీసుల హెచ్చరికలు, ముందస్తు గృహ నిర్బంధాలు, అరెస్టులను లెక్క చేయలేదు. అడ్డంకులను అధిగమించి నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చలో కలెక్టరేట్ను విజయవంతం చేశారు. నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ల కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా కొన్నిచోట్ల అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా... సీఎం జగన్ మాట తప్పి తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. కొవిడ్ సమయంలో మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించాలని, కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని, రేషన్కార్డును తొలగించకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
బారికేడ్లను, బలగాలను అధిగమించి..
చిత్తూరుకు బయలుదేరిన కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించినా... బారికేడ్లను, పోలీసు బలగాలను తప్పించుకొని కొందరు కలెక్టరేట్ ఎదుట నినదించారు.
అనంతరం కలెక్టర్ హరినారాయణన్కు వినతిపత్రం అందించి తిరిగి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీసుస్టేషన్కు తరలించారు. కడప కలెక్టరేట్ వద్ద నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కర్నూలులో మహిళలు కలెక్టరేట్లోకి చొచ్చుకురాకుండా భారీగా మహిళా పోలీసులను మోహరించినా కొందరు గేటు ఎక్కి కలెక్టరేట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతపురంలో భారీ ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
సాధారణ దుస్తుల్లో వచ్చి... పోలీసులను ఏమార్చి
కృష్ణా జిల్లాలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వందలాది మంది అంగన్వాడీలు మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్కు చేరుకున్నారు. పోలీసులను ఏమార్చడానికి వారంతా సాధారణ దుస్తుల్లో వచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ నిరసనల్లో పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లు సైతం నిరసనలతో మారుమోగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆధ్వర్యంలో వారంతా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్డుపై బైఠాయించారు.