ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యో పాపం: అమ్మ, చెల్లెమ్మ కోసం.. పదేళ్ల పసివాడు.. ఎంతటి కష్టం చేశాడమ్మా! - 10 years sharuk left his mother and sisiter in kurnool

ఆ బుడ్డోడి వయసు పట్టుమని పదేళ్లు. కానీ.. వయసుకు మించిన భారాన్ని మోశాడు. తల్లి నడవలేదు. చెల్లికి నడిచేంత వయసు లేదు. ఇక తానే అన్నీ అయి తల్లి, చెల్లిని తీసుకుని తన తోబుట్టువుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పెద్ద సాహసమే చేశాడు. ఎవరా బుడ్డోడు.. ఏంటా సాహసం..?

10 years sharuk
10 years sharuk

By

Published : Jun 29, 2020, 3:15 PM IST

పదేళ్ల పిల్లాడు... శక్తినంతా కూడదీసుకుంటున్నాడు.. వయసుకు మించిన బలంతో చక్రాల కుర్చీని ముందుకు నెడుతున్నాడు. ఆ వాహనంలో నడవలేని అమ్మ... ఆమె ఒడిలో చెల్లెమ్మ. ఎలాగైనా సరే... ఎంత కష్టమైనా సరే.. తన వారిని కలుసుకోవాలనే పట్టుదలతో అడుగులో అడుగు వేస్తూ సాగుతున్నాడు. బయల్దేరింది హైదరాబాద్ నుంచి. చేరాల్సింది బెంగళూరుకు. దూరం దాదాపు 570 కిలోమీటర్లు. రాత్రనక పగలనక.. ఎండనక వాననక... ఒకటి కాదు రెండు కాదు.. అప్పటికే జాతీయ రహదారిపై 250 కిలోమీటర్లు నడిచాడు. తల్లినీ, చెల్లినీ మోస్తున్న బండిని లాగాడు. అలా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు దాటేశాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో కొందరు యువకులు.. ఆ బాలుడితో మాట్లాడాక కానీ ఆ బుడ్డోడు ఎంతటి సాహాసం చేస్తున్నాడన్నది బయటపడలేదు.

వారంతా.. ఎక్కడివారంటే..!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసీనాకు ఐదుగురు పిల్లలు. భర్త మరణించారు. పిల్లలతో కలసి కూలిపనులు, భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. సంచార బృందంతో కలిసి కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. ముగ్గురు పిల్లలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బృందంతో కలిసి బెంగళూరులోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. లాక్‌డౌన్‌ వల్ల కుమారుడు షారుఖ్‌, చిన్న కుమార్తె మున్నీతో పాటు హసీనా హైదరాబాద్‌లో ఉండిపోయారు. ఆమె కాలు సరిగా లేక నడవలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. విధి లేక.. షారుఖ్ సాహసానికి సిద్ధమయ్యాడు.‌ తన తల్లిని, చెల్లిని చక్రాల కుర్చీపై కూర్చోబెట్టుకుని బెంగళూరు బయలుదేరాడు.

ప్రత్యేక వాహనంలో...

అక్కడున్న తన ముగ్గురు తోబుట్టువులను కలుసుకుని, కలోగంజో కలిసే తాగి బతకాలనేది ఆ పిల్లాడి తపన. జూన్‌ మొదటి వారంలో ప్రయాణం ప్రారంభించారు. దారిలో భిక్షాటన చేసుకుంటూ దాతలు ఇచ్చిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ వెళ్తున్నారు. వెల్దుర్తికి చెందిన యువకులు కొందరు ఆదివారం షారుఖ్‌తో మాట్లాడగా అసలు విషయం తెలిసింది. ఆ యువకులు వెల్దుర్తి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డికి పరిస్థితిని వివరించారు. ఆయన స్పందించి డోన్‌లోని ద్రోణాచలం సేవాసమితి సభ్యులను సంప్రదించారు. అందరూ తలాకొంత డబ్బు పోగుచేసి, బాలుడు, తల్లీకుమార్తెలను ప్రత్యేక వాహనంలో బెంగళూరు పంపారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్​ కాంగ్రెస్ పార్టీ అని వాడొద్దని ఈసీ చెప్పింది: రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details