రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో కృష్ణా జిల్లా తక్కెళ్లపాడుకు చేరుకున్న సీఎం జగన్... హద్దురాయి పాతారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కార్యక్రమం ప్రారంభించారు. సర్వేకు వినియోగించే పరికరాలను పరిశీలించిన సీఎం, డ్రోన్లను ప్రారంభించారు. ఆ తర్వాత జగ్గయ్యపేట చేరుకున్న ఆయన అక్కడి ఎస్జీఎస్ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సర్వే పూర్తి చేసిన తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కొందరు భూ యజమానులకు ఫీల్డు మ్యాప్, భూయాజమాన్య హక్కు పత్రం(1బీ), స్థలాలు, ఇళ్ల వంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు(ఆస్తి పత్రం) అందజేశారు. రీ సర్వే పూర్తి చేసిన తక్కెళ్లపాడు గ్రామ సచివాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ సీఎం లాంఛనంగా ప్రారంభించారు. డిజిటలైజేషన్ చేసిన రికార్డులను గ్రామ సచివాలయ సిబ్బందికి సీఎం అందించారు.
పూర్తి హక్కులు కల్పిస్తాం
ప్రస్తుతం భూ యజమానులకు భూములపైన ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయని.. పూర్తి హక్కులు లేవని సీఎం జగన్ అన్నారు. భూరక్ష-భూహక్కు పత్రం ద్వారా పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, స్థిరాస్తికి సంబంధించి అవకతవకలు, సహా భూ సమస్యలు పరిష్కరించి రైతులకు స్థిరాస్తులపై పూర్తి స్థాయిలో హక్కు కల్పించేందుకు రీ సర్వే చేపట్టినట్లు సీఎం తెలిపారు. రైతులు నష్టపోయిన భూమికి ప్రభుత్వం హామీగా ఉంటుందని, తగిన పరిహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో భూములంటే గోల్డ్ స్టాండర్డ్ ముద్ర అనేలా తీర్చి దిద్దుతామన్నారు.
100 ఏళ్ల తర్వాత
భూములు కబ్జాలకు గురై కష్టాలు పడుతోన్న వారిని చూసి సమస్యల పరిష్కారానికి కార్యక్రమం చేపట్టినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం...అలాంటి వారి నుంచి భూములను యజమానులు కాపాడుకునేందుకే సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా 1927-28లో సర్వే జరిగిందని ... దాదాపు 100 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రీ సర్వేతో భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై, ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం అన్నారు.
గత పరిస్థితి ఉండొద్దు
ల్యాండ్ గ్రాబింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటే పక్కాగా రికార్డులు కావాలి. వీటన్నింటికి సమాధానంగా ఇదే తక్కెళ్లపాడు నుంచి భూముల సర్వేకు, శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులు నష్టపోయిన భూమికి ప్రభుత్వం హమీగా ఉంటుంది. ప్రస్తుతం భూముల వివరాలు కావాలంటే 4 విభాగాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గతంలో ఉన్న పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ల్యాండ్ రికార్డుల్లో ఒక మోడల్గా ఉండాలని చర్యలు తీసుకుంటున్నాం.
-వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి
1000 కోట్ల వ్యయంతో..
'రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కూడా కొలిచే ఈ సర్వే మూడు దశల్లో 2023 నాటికి పూర్తి అవుతుంది. సర్వేకు అయ్యే ఖర్చులో ఒక్క పైసా కూడా రైతు, భూయజమానులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. సర్వే రాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ‘దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం చేపట్టగా, 4500 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే చేస్తున్నాం.' అని సీఎం జగన్ చెప్పారు.