ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 29, 2020, 9:47 AM IST

ETV Bharat / state

వైఎస్​ఆర్ చేయూత.. మగువలకు ఆర్థిక భరోసా..

వైఎస్​ఆర్ చేయూత పథకానికి కృష్ణా జిల్లా నుంచి 2.11 లక్షల దరఖాస్తులు అందాయి. అన్నింటినీ పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. వచ్చే నెలలో తొలివిడత నిధులను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

ysr cheyutha scheme in krishna district
వైయస్​ఆర్ చేయూత

పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగియటంతో.. ఇప్పటి వరకు అందిన 2.11 లక్షల దరఖాస్తులను అధికారులు పునఃపరిశీలన చేస్తున్నారు. 27వ తేదీ ప్రారంభమైన ఈ ప్రక్రియ 30వ తేదీతో పూర్తవుతుంది. అప్పటి నుంచి మరో 3 రోజులు సామాజిక తనిఖీలు నిర్వహించి తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ దగ్గర పరిపాలన అనుమతి పొంది.. జిల్లాకు కావాల్సిన బడ్జెట్‌పై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ఈ పథకం అమలుపై మహిళలు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే నెలలో తొలివిడత నిధులను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

కృష్ణా జిల్లాలో 45 - 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సాయం అందాలంటే.. కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అయ్యింది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కులధ్రువీకరణ పత్రాలు అందలేదు. వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఒక్కో సచివాలయం నుంచి దాదాపు 100 నుంచి 150 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

* గ్రామీణ ప్రాంతంలో ఒక కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. ఆధార్‌ పత్రంలో పేర్కొన్న వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.

* కుటుంబ సభ్యులందరికీ సాగు భూమి మాగాణి మూడెకరాలు, మెట్ట, రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబసభ్యులకు 4 చక్రాల వాహనాలు(టాక్సీ, ట్రాక్టరు, ఆటోలకు మినహాయింపు) ఉంటే వర్తించదు.

* వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకం ద్వారా లబ్ధిపొందుతున్న 60 ఏళ్లలోపున్న వారికి కూడా లబ్ధి చేకూర్చనున్నారు. గృహ విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్లు లోపు ఉండాలి. ఆయా వర్గాలకు చెందిన వారు అధికారిక కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలను అనుసరించి అర్హులను ఎంపిక చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.

ఇవీ చదవండి...

మాస్క్‌ లేకపోతే అక్కడ 100 పౌండ్ల జరిమానా

ABOUT THE AUTHOR

...view details