ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2022, 5:08 PM IST

ETV Bharat / state

పిండివంటల వ్యాపారం.. రాణిస్తున్న వక్కలగడ్డ వనితలు

పల్లెటూర్లో ఆదాయం తక్కువ.. నగరానికెళ్లి చిన్న పనైనా చేసుకుంటే చాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే.. చేసే పనిపై నమ్మకం, సరైన ప్రణాళిక ఉంటే.. ఎక్కడున్నా ఆదాయం వస్తుందని గ్రామీణ మహిళలు నిరూపిస్తున్నారు. చేయితిరిగిన నైపుణ్యాన్నే పెట్టుబడిగా పెట్టి.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ పల్లెటూరిలో అంత ఆదాయం ఎలా వస్తుందని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే.

vakkalagadda of krishna district women is earning with food items
పిండివంటల వ్యాపారం.. రాణిస్తున్న వక్కలగడ్డ వనితలు

పిండివంటల వ్యాపారంలో రాణిస్తున్న వక్కలగడ్డ వనితలు

ఇంటి పనుల తర్వాత మిగతా సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని భావించిన కృష్ణా జిల్లా వక్కలగడ్డకు చెందిన ఐదుగురు మహిళలు.. ఏదైనా వ్యాపారం చేయాలని సంకల్పించారు. భర్తకు, పిల్లలకు చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నారు. ఒకరోజు వాకింగ్‌ చేస్తుండగా వీరికి పిండివంటల వ్యాపారం ఆలోచన వచ్చింది. 2003లో మధుర, రుచి, శ్రీసాయి హోం ఫుడ్స్ సంస్థలను ఆరంభించి ఆలోచనను అమల్లోకి తెచ్చారు. కజ్జి కాయలు, నేతి బొబ్బట్లు, సున్నుండలు, అరిసెలు, చలివిడి, పచ్చళ్లు, ఇతర ప్రత్యేక వంటలు చేస్తూ.. పెద్దఎత్తున ఆర్డర్లు పొందుతున్నారు.

ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ..
ఒక్కొక్కరు 500 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి.. ఆంధ్రులు మెచ్చే వంటలు తయారుచేసి దేశ నలుమూలలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, సింగపూర్, కెనడా , అరబ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకుంటూ.. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తున్నారు. ఐదుగురు సభ్యులు మంచి ఆదాయం పొందడంతో పాటు.. మరో 50 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు.

విజయం సాధించడానికి ప్రాంతంతో సంబంధం లేదు..
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని.. విజయం సాధించడానికి ప్రాంతంతో సంబంధం లేదని వక్కలగడ్డ వనితలు నిరూపించారు. తమ వంటకాలతో దేశ విదేశాల్లో వారికీ రుచులు పంచుతూ నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి:

అమ్మకు ఇచ్చిన మాట కోసం.. అందరికీ అమ్మయ్యాడు..!

ABOUT THE AUTHOR

...view details