ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 16, 2020, 7:22 PM IST

ETV Bharat / state

ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం

మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులు హత్యకు గురవ్వడంతో బెజవాడ ఉలిక్కిపడింది. ఈ రెండు ఘటనలతో మళ్లీ సంచలనాలకు వేదికైంది.ప్రేమ పేరుతో కొందరు యువకులు.. యువతులపై దాడులకు తెగబడుతున్నారు. విలువైన ప్రాణాలను బలిగొంటున్నారు. బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. విపరీత ధోరణితో వ్యవహరిస్తూనే తమకు తాము హాని చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు.

ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం
ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం

అదే స్థాయిలో రెండు ఘటనలు

2020, అక్టోబరు 12న.. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన చిన్నారి అనే యువతిపై అదే గ్రామస్థుడు నాగభూషణం అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగభూషణం మరుసటి రోజు మృతి చెందాడు.

2020, అక్టోబరు 15.. నాగేంద్రబాబు అనే యువకుడు క్రీస్తురాజపురంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజశ్విని ఇంటికి వెళ్లి, విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలను బలిగొన్నాడు. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనకూ ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల విచారణలో తేలింది.

మహిళలపై దాడులెన్నో...

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అత్యాచారం, హత్యలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, ఆత్మహత్యకు ప్రేరేపించటం వంటి వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 2013 నుంచి 2019 వరకు మహిళలపై జరిగిన వివిధ రకాల దాడుల కేసులు ఇలా ఉన్నాయి...

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన రెండు ఘోరమైన ఘటనల్లో యువతులు మృతిచెందడం కలకలం రేపుతోంది. మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. చట్టాలను కఠినంగా అమలు చేస్తే.. ఇలాంటివి పునరావృతం కావని మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


నాటి సంచలనాలు..

  • 2004, జూన్‌ 21న... శారదా పీజీ కళాశాలలో ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న శ్రీలక్ష్మి తరగతి గదిలోనే దారుణహత్య. తోటి విద్యార్థి మనోహర్‌ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, ప్రాణం తీశాడు.
    శ్రీలక్ష్మి తరగతి గదిలోనే దారుణహత్య
  • 2007, ఫిబ్రవరి 10న... గుడివాడకు చెందిన ఓ టీవీ యాంకర్‌ గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో హత్యకు గురయ్యారు. మేకప్‌మెన్‌గా పని చేసే చంద్రశేఖర్‌ ఆమెను లాడ్జికి తీసుకువచ్చి, దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం.
    టీవీ యాంకర్‌ గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో హత్య
  • ఇదే తరహాలో ప్రేమ విషయమై అప్పట్లోనే పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక హత్యకు గురయ్యింది. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. ఈ నాలుగు ఘటనలతో విజయవాడ పెను సంచలనాలకు కేంద్రమైంది.

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో..

డాక్టర్‌ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు

తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్న పిల్లలు విద్యపై దృష్టి పెడతారు. 20 నుంచి 25 ఏళ్ల వయసులో జీవితంలో స్థిరపడతారు. పెద్దల పర్యవేక్షణ లేనివారు జులాయిగా పెరుగుతూ ప్రేమ పేరుతో యువతుల వెంటపడతారు. ఉన్మాదపు మనస్తత్వం ఉన్న వారు వెయ్యి మందిలో ముగ్గురో నలుగురో ఉంటారు. వీరికి ప్రేమ, ఎమోషన్‌ తక్కువ. అనుకున్నది వెంటనే కావాలి. అవసరమైతే చంపైనా దానిని తీసుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ననాటి నుంచే వారితో ప్రేమగా ఉంటూ, పర్యవేక్షిస్తూ ఉంటే.. ఇలాంటి ఘటనలకు తావుండదు.

- డాక్టర్‌ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, హెచ్‌వోడీ, సిద్ధార్థ వైద్య కళాశాల

కోరుకున్నదే జరగాలన్న పట్టుదల

డాక్టర్‌ టి.ఎస్‌.రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

కొంత మంది పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరంగా ఉంటారు. మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. తాము అనుకున్నది సాధించాలని, తమదే పై చేయి కావాలని కోరుకుంటారు. విచ్చలవిడితనం, నైతిక విలువలు ఉండవు. ప్రేమించిన యువతి కాదనే సరికి తట్టుకోలేక దాడులకు పాల్పడతారు.

--- డాక్టర్‌ టి.ఎస్‌.రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం

ఇదీ చదవండి :పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details