అమ్మితే కోత... కొనాలంటే మోత... ఇదీ కృష్ణాజిల్లాలోని టమాటా రైతుల పరిస్థితి. తాము టమాటా సాగు చేసిన సమయంలో మంచి దిగుబడులు వచ్చినా.... ధరలు లేక కనీసం కూలీ ఖర్చులూ మిగల్లేదని... ఇప్పుడు టమాటా కొనాలంటే వంద రూపాయలకు మించి ధరలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లోని మెట్ట భూముల్లో రైతులు ఎక్కువగా టమాటా పంటను పండిస్తారు. ఏటా అక్టోబరు నుంచి మే నెల వరకు ఈ పంటను సాగు చేస్తారు. ఇక్కడ పండిన టమాటాను మచిలీపట్నం, గుడివాడ, చల్లపల్లి, విజయవాడ, హైదరాబాద్లోని మార్కెట్లకు పంపిస్తారు. ఈ ప్రాంతంలో దిగుబడులు వచ్చేసరికి కేజీ టమాటా ఐదు రూపాయలు కూడా ఉండట్లేదు. ప్రతి సంవత్సరం ఇలానే రైతులు నష్టపోతూనే ఉన్నారు.
"ఎటువంటి టమాటా వెయ్యాలో రైతులకు అవగాహన కల్పించాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటాను వేయాలని రైతుల్ని ప్రోత్సహించాలి. టామాటాల నిల్వ కోసం రైతులకు కోల్డ్ స్టోరేజ్లను ప్రభుత్వం కట్టింటాలి. ధర ఎక్కువ ఉన్నప్పుడు రైతులు అమ్ముకునేలా ఉంటే రైతుకు గానీ వినియోగదారులకు గానీ నష్టం రాకుండా ఉంటుంది."