ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Construction of Vijayawada Bypass : ఇంకెన్నాాళ్లో..? విజయవాడ బైపాస్ పనుల్లో 'హై టెన్షన్' బ్రేక్

Construction of Vijayawada Bypass : 2021లో ప్రారంభమైన విజయవాడ బైపాస్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. భూసేకరణలో సమస్య కారణంగా.. మొత్తం 30 కిలో మీటర్ల తొలి దశ నిర్మాణ పనుల్లో 15శాతం నిలిచిపోయాయి. రైతులు కోరుతున్న పరిహారం... కాంట్రాక్టు సంస్థ ఇస్తామంటున్న పరిహారానికి మధ్య తేడా కారణంగా సమస్య కొలిక్కి రావడం లేదు. ఆ ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ తీగల కింద పనిచేయడానికి కార్మికులు ససేమిరా అంటున్నారు.

By

Published : Jun 10, 2023, 1:11 PM IST

Etv Bharat
Etv Bharat

Construction of Vijayawada Bypass : విజయవాడ బైపాస్ నిర్మాణానికి విద్యుత్ హై టెన్షన్ తీగలు అడ్డంకిగా మారాయి. 220 కేవీ, 330 కేవీ హై టెన్షన్ విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతుండటంతో అక్కడ పని చేసేందుకు కార్మికులు భయపడుతున్నారు. హై టెన్షన్ వైర్లను తొలగించి పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ లైన్లు మార్చేందుకు స్థానికంగా రైతుల వద్ద నుంచి కొంత భూమిని సేకరించాల్సి ఉంది. తమకు సరైన పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అంటున్నారు. రైతులు కోరుతున్న పరిహారం తాము ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ హై టెన్షన్ వైర్లు రోడ్డుకు అడ్డుగా వస్తున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను గుత్తేదారులు నిలిపివేశారు. దీంతో విజయవాడ బై పాస్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.

2021లో పనులు ప్రారంభం... గన్నవరం నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు దాదాపు 30 కిలో మీటర్లనుమెదటి విడత ప్రాధాన్యతతో విజయవాడ బైపాస్ ను జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం చేపట్టింది. 2021లో రహదారి పనులను గుత్తేదారు సంస్థలు ప్రారంభించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా 15 శాతం పనులు మిగిలాయి. నిర్మాణ జాప్యానికి హైటెన్షన్ విద్యుత్తు లైన్లు తొలగించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలో మీటర్ల మేర ఆరు వరుసలతో రహదారి నిర్మించాలి. రెండు పై వంతెనలు, రెండు ఆర్వోబీలు, 3 ప్రధాన వంతెనలు, 42 బాక్సు కల్వర్టులు, 4 కల్వర్టులు, 11 చిన్న వంతెనలు, 2 ట్రక్కు బేలను గుత్తేదారు సంస్థ నిర్మాణం చేస్తోంది. రెండు పైవంతెనలు పూర్తవగా రెండు ఆర్వోబీలు, 3 వాహనాలు వెళ్లే అండర్ పాస్​లు, ఒక బాక్సు కల్వర్టు కట్టాలి.

విద్యుత్ తీగల కారణంగా.. మొత్తం 30 కిలో మీటర్లకు గాను భూసేకరణ సమస్యతో 2 కిలో మీటర్ల వరకు గుత్తేదారు సంస్థకు అధికారులు భూమిని అప్పగించలేదు. విద్యుత్తు హైటెన్షన్ లైన్లు తొలగించకపోవడంతో ఆ ప్రాంతంలో రహదారి నిర్మాణం నిలిచిపోయింది. విద్యుత్ హైటెన్షన్ వైర్లు కిందకి వేలాడుతుండటంతో ఆ ప్రాంతంలో నిర్మాణాలను గుత్తేదారులు నిలిపివేశారు. విద్యుత్ హైటెన్షన్ వైర్లను తొలగించేందుకు స్థానిక రైతుల నుంచి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు.

పరిహారం కోరుతున్న రైతులు... భూసేకరణ చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ విలువకు ఒకటిన్నర రెట్లు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ రైతులు మాత్రం కనీసం రెండున్నర రెట్లు ఇస్తేనే పొలాలు అప్పగిస్తామని స్పష్టం చేస్తున్నారు. హెచ్ టీ లైన్లు వేసిన తర్వాత తమ భూముల ధరలు పడిపోతున్నాయనీ, అక్కడ పంటల సాగుకు కూడా వీలు ఉండదని రైతులు చెబుతున్నారు. మరో వైపు రైతుల భూములకు రెండున్నర రెట్లు పరిహారం ఇచ్చేందుకు జాతీయ రహదారుల సంస్థ అంగీకరించడం లేదు. ఓ వైపు రైతులు మరో వైపు కాంట్రాక్టు సంస్థ మధ్యన సబ్ కలెక్టర్, సంయుక్త కలెక్టర్ స్థాయిలో చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది.

ABOUT THE AUTHOR

...view details