ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 11:04 PM IST

ETV Bharat / state

ఆ గాయానికి 8 ఏళ్లు.. అయినా సంతృప్తినిచ్చింది: చంద్రబాబు

‘‘వస్తున్నా మీకోసం’’ పాదయాత్ర తన జీవితంలో మరువలేని ఘట్టమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వైకాపా పాలనలో ప్రజల కష్టాలు చూస్తుంటే అప్పటి పాదయాత్ర పరిస్థితులే గుర్తుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని.. వైకాపా లాంటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదని ఆయన ధ్వజమెత్తారు.

ఆ గాయానికి 8 ఏళ్లు.. అయినా సంతృప్తినిచ్చింది : చంద్రబాబు
ఆ గాయానికి 8 ఏళ్లు.. అయినా సంతృప్తినిచ్చింది : చంద్రబాబు

‘‘వస్తున్నా మీకోసం’’ పాదయాత్ర తన జీవితంలో మరువలేని ఘట్టమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వైకాపా పాలనలో ప్రజలకు వెలితి ఉందని.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని.. వైకాపా లాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

ఆ తెగువ అందరిలో రావాలి..

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే తెగువ అందరిలో రావాలని పిలుపునిచ్చారు. "వస్తున్నా మీకోసం" పాదయాత్ర ప్రారంభించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న సహచరులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాజం పట్ల బాధ్యతను గుర్తుకుతెచ్చిన ఆ పాదయాత్ర.. ఎనలేని సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

వారి కష్టాల నుంచే ఆ పథకాలు..

పాదయాత్రలో రైతుల కష్టాలు చూసే రుణమాఫీ అమలు చేయటంతో పాటు నదుల అనుసంధానం, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ది పనుల్లో పోటీబడే పాలకులను చూశాం కాని వాటిని నిలిపేసే ఉన్మాద పాలన మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజీలేకుండా పోరాడాలి..

వైకాపా అణిచివేత చర్యలపై రాజీలేని పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాలికి గాయమైనా, మొక్కవోని పట్టుదలతో ముందుకు నడవగలిగానంటే అందుకు వెన్నంటి నిలిచిన పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలిచ్చిన ప్రోత్సాహమే కారణమన్నారు.

ఇప్పటికీ నొప్పిగానే..

ఇప్పటికీ ఆ గాయం అప్పుడప్పుడు కాలిలో కలుక్కుమంటూ తీవ్రంగా నొప్పి పుడుతుందన్నారు చంద్రబాబు. అయినా ఆ గాయం ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయిందన్నారు. కాలు నొప్పి అనిపించినప్పుడల్లా అప్పటి పాదయాత్ర మధురానుభూతులు గుర్తొచ్చి సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తాయన్నారు. నాటి పాదయాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, గోనుగుంట్ల కోటేశ్వర రావు, చంద్రదండు ప్రకాశ్‌ నాయుడు, పీఆర్‌ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి :తెగిన వంతెన.. గ్రామానికి నిలిచిన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details