ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద తగ్గింది.. పంట నష్టం తేలుతుంది - కృష్ణా జిల్లాలో వరదలతో పంట నష్టం వార్తలు

లంక గ్రామాల్లో వరద నీరు తగ్గినా.. నష్టం మాత్రం అపారంగా ఉంది. పంటలు పూర్తిగా కుళ్లిపోవటం లేదా ఎండిపోవటంతో నిండా మునిగామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదలు, భారీ వర్షాలతో కొద్ది రోజుల నుంచి జలదిగ్బంధంలోనే చిక్కుకున్న లంక గ్రామాల్లో నీటి ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో పంట నష్టం కనిపించి రైతులు బోరుమంటున్నారు.

వరద తగ్గింది.. పంట నష్టం తేలుతుంది
వరద తగ్గింది.. పంట నష్టం తేలుతుంది

By

Published : Oct 20, 2020, 4:02 PM IST

ఎడతెరపి లేని వర్షాలు.. ఉద్ధృతంగా కొనసాగుతున్న వరద అన్నదాతలను నిండా ముంచేసింది. కౌలు తీసుకుని సాగు చేస్తున్న రైతులను వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఐదుసార్లు వచ్చిన వరదతో పాటు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. చేతికొస్తుందనుకున్న ఉద్యాన పంటలు రోజుల తరబడి నీటిలో నానుతూ కుళ్లిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి కూడా రాని దయనీయస్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వరద తగ్గింది.. పంట నష్టం తేలుతుంది

కృష్ణా జిల్లాలో రెండు రోజులతో పోలిస్తే వరద తీవ్రత కొంచెం తగ్గడంతో పంట నష్టం తేలుతోంది. ముంపు ప్రభావిత ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఇళ్లు, పొలాలు ముంపు నుంచి బయట పడుతున్నాయి. ఈ ఏడాది వరదకు అందరికంటే ఎక్కువగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిని కోల్పోయారు. పంటలు కుళ్లిపోయి పనికి రాకుండా పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాలు ఇంకా నీటిలో మునిగే ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో నీరు తగ్గినచోట ప్రజలు తమ ఇళ్లకు వెళ్తున్నారు. మిగిలిన వారు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు.

వరదల కారణంగా నష్టపోయిన పరిహారం వెంటనే చెల్లించాలని రైతులు వేడుకొంటున్నారు. గత ఏడాది పరిహారమే ఇంతవరకూ ఇవ్వకపోవటాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇలా అయితే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వరదకు తోడు అప్పుడప్పుడు కురిసే ఏకధాటి వర్షంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ABOUT THE AUTHOR

...view details