రైతు కోసం- తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలు మూడో రోజు కొనసాగాయి. వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో
నివర్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా నేత తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వీరులపాడులో రైతులకు న్యాయం చేయాలంటూ.. ర్యాలీగా వెళ్లిన తెదెపా నేతలు తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. రైతన్నకు న్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తేవాలన్నారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో
రైతు సమస్యలపై.. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. రైతుల వద్ద నుంచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వారికి వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నెల్లూరులో
నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నామమాత్రంగా సహాయం చేసిందని.. తేదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఈ పరిహారం సంక్రాంతి కానుకని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.