నా మొదటి కెరీర్ యానిమేషన్. పెళ్లయ్యాక ఈ రంగంలోకి వచ్చా. అందులో ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యా. అదే నన్ను ఈతకొలనులోకి దిగేలా చేసింది. స్విమ్మింగ్ చేస్తే కుంగుబాటు నుంచి బయటపడొచ్చన్నారు వైద్యులు. కానీ చిన్నప్పటి నుంచి నాకు నీళ్లంటే భయం. దాన్ని దాటి ఈత నేర్చుకోవడానికి వెళ్లా. మొదట్లో కొంచెం తడబడినా నెమ్మదిగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టా. నెలలోపు మూడు స్ట్రోక్స్ను నేర్చుకోగలిగా. ఇందులో మంచి ప్రావీణ్యం సంపాదించాలంటే ఒక లక్ష్యం ఉంటేనే వీలవుతుందని పోటీలకూ హాజరయ్యేదాన్ని. అప్పట్నుంచి ఏటా పోటీల్లో పాల్గొనేదాన్ని. అలా ఇప్పటివరకూ రాష్ట్ర స్థాయిలో నాలుగు బంగారు పతకాలూ అందుకున్నా.
నీ వల్లకాదు అన్నారు...
ఓ సారి పత్రికలో ఇంగ్లిష్ ఛానెల్ను ఈదిన వారి గురించిన వార్త చూశా. దాన్ని చదివినప్పుడు నేనూ అలాంటి పెద్ద లక్ష్యం ఏదైనా సాధించాలనిపించింది. అయితే అందరిలా ఇంగ్లిష్ ఛానెల్ను కాకుండా మన దేశంలో ఉండేదాన్ని ఎంచుకోవాలనుకున్నా. అదే పాక్ జలసంధి. తమిళనాడులోని రామేశ్వరం-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను కలుపుతుందది. మొత్తం 30 కి.మీ దూరం ఉంటుంది. గతంలో దీన్ని 14 మంది దాటగా, వారిలో ఒకే ఒక మహిళ ఉన్నారని తెలిశాక నా లక్ష్యమిదే అనుకున్నా. స్నేహితులతో చెబితే ‘నీ వయసు 40 దాటింది. ఇలాంటి సాహసాలు 25 ఏళ్లలోపు వారు మాత్రమే చేయగలరు’ అంటూ నిరుత్సాహపరిచారు. కానీ నేను దీన్నో సవాల్గా తీసుకున్నా.
కరోనా వల్ల వద్దన్నారు...
పాక్ జలసంధిని ఈదేటప్పుడు కో-స్విమ్మర్స్ ఉండాలి. అలా ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమో అని తెలిసినవారికి చెప్పా. మహారాష్ట్ర నుంచి ఆరుగురు వస్తామన్నారు. సాధన మొదలుపెట్టా. కావాల్సిన అనుమతులను పొందా. అకస్మాత్తుగా ఓ రోజు నాతోపాటు వస్తామన్న వారు రావడంలేదన్నారు. అంతేకాదు, అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, నన్ను కూడా ఈ సాహసానికి పూనుకోవద్దని చెప్పి మరీ వెళ్లారు. అయినా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. దాంతో రామేశ్వరంలోని ముగ్గురు జాలర్లను ఓ గంటసేపైనా నాతోపాటు ఈదేందుకు అనుమతి ఇవ్వమని అక్కడి బోట్క్లబ్ కోరాను. వారు ఒప్పుకోవడంతో నా లక్ష్యాన్ని చేరుకునేందుకు గతేడాది మార్చి 12న రామేశ్వరం చేరుకున్నా. కానీ అక్కడికెళ్లాక కరోనా కారణంతో రద్దు చేసుకోమన్నారు. దాంతో నిరాశగా హైదరాబాద్కు చేరుకున్నా.