తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజూ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురం మండలం సహా.. కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో పందేల బరులు వెలిశాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి పందేలను నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటితో పాటు గుండాటలు జోరుగా నిర్వహిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
రూ.లక్షల్లో పందేలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలోని తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోయాయి. తేతలి, దువ్వ, వేల్పూరు, అత్తిలి, ఇరగవరం తదితర ప్రాంతాల్లో కోడి పందేలతో పాటు... గుండాట, పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రెండోరోజూ పందెం రాయుళ్లు బరుల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్షల రూపాయల పందేలు కాస్తున్నారు.
వింధు బోజనం
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో భారీ స్థాయిలో కోడిపందేలు జరగుతున్నాయి. వీటిని ఆడేందుకు, తిలకించేందుకు వచ్చినవారికి ఉచిత భోజనం ఏర్పాటు చేశారు పందెం నిర్వాహకులు. అదీ కోడి మాంసం కూరతో. ఇంకేముంది... వందల సంఖ్యలో పందెంరాయుళ్లు బారులు తీరారు. వందల కిలోల చికెన్ వండి వడ్డిస్తున్నారు. పండగ పూట ఆనందంగా గడపడానికి వచ్చి ఆకలితో ఉండకూడదని ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.