తెలంగాణ రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. నిబంధనల సడలింపుతో రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాస్క్లు, గ్లౌజులు ధరించి విధులకు హాజరవుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తూ...
కార్యాలయంలోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరు శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకుంటున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరం నిమిత్తం వచ్చే వారు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలను దూరంగా సర్దుబాటు చేశారు.
జాగ్రత్తలు పాటించేలా చూస్తూ..
భూములు, భవనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి వచ్చే వారు మాస్క్ ధరించి ఉంటేనే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్న తరువాతనే...తదుపరి ప్రక్రియను మొదలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారు.. మాస్క్ బదులు టవల్ను మూతికి అడ్డం కట్టుకునైనా రావాలని స్పష్టం చేస్తున్నారు.
ఆన్లైన్లో స్లాట్ బుకింగ్
రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో రద్దీని పూర్తి స్థాయిలో దూరం చేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు... ముందు ఆన్లైన్ ద్వారా స్లాట్లను బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కేటాయించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్తున్నారు. కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి అవసరం లేకుండా పోయింది.