ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 7:51 PM IST

ETV Bharat / state

తెలంగాణ: 51 వేల పోలీసులతో గ్రేటర్ పోరుకు భద్రత

తెలంగాణ జీహెచ్ఎంసీ పోలింగ్‌ కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఘర్షణలకు తావివ్వకుండా నిఘా నేత్రాలతో పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.

Police reinforcements for GHMC polling
తెలంగాణ బల్దియా పోరుకు భద్రత

తెలంగాణ బల్దియా పోరుకు భద్రత

అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం జరగనుంది. కీలకమైన ఓటింగ్‌ కోసం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కలిపి 51 వేల 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఆర్సీ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా విభజించిన ఉన్నతాధికారులు.. ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. స్థానిక పోలీసులు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్పెషల్​ పోలీసు, అశ్విక దళంతో పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు.

మద్యం, గంజాయి స్వాధీనం

జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 88 డివిజన్లున్నాయి. ఇప్పటివరకు 3066 మందికి పైగా రౌడీషీటర్లు.. అనుమానితులను బైండోవర్ చేశారు. 4 వేల 187 లైసెన్సు కలిగిన తుపాకులను డిపాజిట్ చేశారు. కోటి 45 లక్షల నగదు, 10 లక్షలు విలువైన మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 32 డివిజన్లున్నాయి. 674 పోలింగ్ స్టేషన్లలో 2 వేల 569 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 770 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. 15 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 30 డివిజన్లున్నాయి. 573 పోలింగ్ స్టేషన్లలో 1,640 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 498 సమస్యాత్మక, 101 అతి సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేలా ఏర్పాట్లు చేశారు. రూట్ మొబైల్ టీమ్‌లు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు.


ఇదీ చూడండి :'మా పార్టీ ఆర్చ్​ను కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details