కరోనాపై పోరులో వివిధ స్థాయిలో సమన్వయం చేసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై వేసవి సెలవుల మొదటి ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతుందని పేర్కొంటూ వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
నోడల్ అధికారుల వ్యవస్థపై అసంతృప్తి
ఆసుపత్రుల వద్ద బాధితులకు సహాయ సహకారాలు అందించే నోడల్ అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విజయవాడలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నియమించిన 56 మంది అధికారులకు పలుమార్లు ఫోన్ చేస్తే 22 మంది కనీసం ఫోన్ ఎత్తకపోవడంపై అసంతృప్తి చెందింది. మిగిలిన 34 మంది ఫోన్ తీసినా పడకలు లేవని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులపై విచారణ జరిపి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వీఐపీల పేరుతో కొన్ని పడకల్ని ఖాళీగా ఉంచడం సరికాదు
ఆసుత్రుల్లో పడకల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ఫోన్ చేస్తే పడకలు లేవని, సుమారు 150 మందికి పైగా వేచి ఉన్నారని సమాధానం చెప్పడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఒక వేళ ఖాళీలు ఉంటే ఈ విధంగా ఎలా చెబుతారో అర్థం కావడం లేదు. కొవిడ్ ఆసుపత్రుల్లో వీఐపీల పేరుతో కొన్ని పడకల్ని ఖాళీగా ఉంచడం సరికాదు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అన్ని పడకలు బాధితులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి...’ అని ఆదేశించింది. పడకలు, ఐసీయూ, వెంటీలేటర్ల సంఖ్యను పెంచాలని చెప్పింది. పత్రికల కథనాల ప్రకారం అనంతపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో పలువురు మృతి చెందారనే విషయాన్ని అమికస్క్యూరీ, సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేసింది. ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించలేదని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెబుతున్నారని తెలిపింది. ఆ మరణాలకు సంబంధించి తదుపరి విచారణ నాటికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ కేటాయింపు, రాష్ట్రంలో మరో 42 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు అనుమతిచ్చే విషయంలోనూ తదుపరి విచారణలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) హరినాథ్ను ఆదేశించింది.
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేశ్బాబు గతేడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్ని అమలు చేయడం లేదని పేర్కొంటూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ (ఏపీసీఎల్ఏ) సంయుక్త కార్యదర్శి బి.మోహన్రావు కూడా హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పొత్తూరి సురేశ్కుమార్ వాదనలు వినిపించారు.
పడకలు లేవంటున్నారు
అధికారికంగానే పడకలు లేవని చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పొత్తూరి సురేశ్కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వైద్య సేవలను ఇంకా పెంచాలని, నియోజకవర్గం స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మరో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదిస్తూ.. ఆక్సిజన్ పడకలు లేక మరణాలు సంభవిస్తున్నాయని, గత 15 రోజుల్లో 15 మంది న్యాయవాదులు కన్నుమూశారని వివరించారు.
800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం