ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వృద్ధుడి హత్య.. దత్త పుత్రిక ప్రేమే కారణమా!

విజయవాడ నగరంలోని దుర్గాఅగ్రహారం లిక్కి పుల్లయ్య వీధిలో శుక్రవారం మధ్యాహ్నం మామిడి సాంబశివరావు అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. దత్త పుత్రిక ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కూతురు ప్రేమించిన యువకుడి స్నేహితుడైన చరణ్‌ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

By

Published : Aug 1, 2020, 6:54 AM IST

Updated : Aug 1, 2020, 9:29 AM IST

old man brutally murdered in vijayawada
విజయవాడలో వృద్ధుడి దారుణహత్య

మామిడి సాంబశివరావు దుర్గాఅగ్రహారం లిక్కి పుల్లయ్యవీధిలో ఉంటారు. ఆయనకు పిల్లలు లేకపోవటంతో తేజశ్రీ అనే యువతిని దత్తత తీసుకున్నారు. ఆమె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె ప్రవీణ్‌ అనే యువకుడిని ప్రేమించింది.ఆ అబ్బాయిది వేరే కులం అయినందున తండ్రి వివాహానికి అంగీకరించలేదు. ఈ విషయమై తండ్రి, కూతుర్ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రవీణ్‌ పుట్టిన రోజు కావటంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో తేజశ్రీని తన స్నేహితుడైన చరణ్‌ను మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక హోటల్‌కు తీసుకువెళ్లి పార్టీ ఇచ్చారు. చరణ్‌ పార్టీ మధ్యలో లేచి తేజశ్రీ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.

కేకలు వినపడటంతో...

సాంబశివరావు లిక్కి పుల్లయ్య వీధిలో భవనం మొదటి అంతస్తులో ఉంటారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే ఆ ఇంట్లో నుంచి చరణ్‌ బయటకు వస్తుండటంతో అతనిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని చరణ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సాంబశివరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

పళ్ల సెట్లు మూడు ముక్కలై...

మృతదేహం పక్కన పళ్ల సెట్టు మూడు ముక్కలై ఉంది. బలమైన వస్తువుతో ముఖంపై, తలపై కొట్టటంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. హత్య జరిగిన భవనం పక్కనే 2 ఇళ్ల అవతల డాబాపై రక్తపు చారికలున్న సుత్తి పడి ఉంది. దీనితోనే హత్య చేసి ఉండవచ్చని, జనం రావటంతో దానిని విసిరేసి ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు.

పోలీసుల విచారణలో వెలుగులోకి కొత్త విషయాలు...

చరణ్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రవీణ్‌కు చరణ్‌ ప్రాణస్నేహితుడని పోలీసుల విచారణలో తేలింది. ప్రవీణ్‌ తన ప్రేమకు సాంబశివరావు అడ్డువస్తున్నాడని స్నేహితుడి వద్ద వాపోవటంతో.. చరణ్‌ ఈ విషయం మాట్లాడేందుకు సాంబశివరావు దగ్గరకు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అక్కడ మాటా మాటా పెరిగి సుత్తితో కొట్టి చంపి ఉండవచ్చని అంచనాకు వచ్చారు. అయితే ఈ హత్య చేయాలన్న ఆలోచన ఒక్క చరణ్‌దేనా? లేక దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో క్లూస్‌ సిబ్బంది ఆధారాలు సేకరించారు. సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

వేకనూరులో భారీ శబ్దంతో పేలుడు

Last Updated : Aug 1, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details