ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MODEL PARKS: డంపింగ్ ప్రాంతాలు... ఇకపై మోడల్ పార్కులు

విజయవాడను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. డంపింగ్‌ యార్డులు, చెత్తా చెదారంతో నిండి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అందమైన పార్కులను రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పార్కులను మరింతగా అభివృద్ధి చేస్తోంది.

By

Published : Sep 14, 2021, 10:08 PM IST

New Model Parks Constructing among the dumping areas in Vijayawada
డంపింగ్ ప్రాంతాలు... ఇకపై మోడల్ పార్కులు...

డంపింగ్ ప్రాంతాలు... ఇకపై మోడల్ పార్కులు...

పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా విజయవాడను నందనవనంగా మార్చాలని భావిస్తోంది నగర పాలక సంస్థ. నగరంలోని ప్రతీ ప్రాంతానికి ఒక పార్కు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. గతంలో డంపింగ్ యార్డులుగా మారిన ప్రభుత్వ స్థలాల్లో..పచ్చటి పార్కుల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు పార్కులను సర్వాంగ సుందరణంగా అభివృద్ధి చేసిన మున్సిపల్ శాఖ..మోడల్ పార్కుల పనుల వేగం పెంచింది.

విజయవాడలో సింగ్‌నగర్‌-వాంబే కాలనీల మధ్య 13 ఎకరాల ప్రభుత్వం స్థలం పూర్తిగా డంపింగ్ యార్డుగా ఉండేంది. ఆ ప్రాంతాన్ని మోడల్‌ పార్కుగా ఏర్పాటు చేసేందుకు 10 కోట్ల రూపాయలతో పనులను గతేడాది ప్రారంభించింది నగర పాలక సంస్థ. పార్కులో కేవలం కూర్చునే సదుపాయం మాత్రమే కాకుండా.. పిల్లలకు ఆటస్థలం, నడకదారి,అత్యంత అహ్లాదకరంగా ఉండేందుకు ప్రత్యేకమైన మొక్కలు, ఎడ్యుకేషన్‌ మ్యూజియం, కుటుంబ సమేతంగా గడిపేందుకు ప్రత్యేకమైన వసతులు కల్పించనున్నారు. దీంతోపాటు నగరంలోని రాఘవయ్య పార్క్, లెనిన్ పార్క్, రాధానగర్ పార్కులను అభివృద్ధిపరుస్తున్నారు.

గతంలో దుర్గందం వెదజల్లే ప్రాంతాన్ని సుందరమైన పార్కులా నగరపాలక సంస్థ అభివృద్ధి చేస్తుండటం పట్ల ఆ ప్రాంతాల వాసులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మార్గం గుండా వెళ్లాలంటే డంపింగ్ యార్డ్ ఉండటం వలన విపరీతమైన చెడు వాసన వచ్చేది. చెత్త నిర్వహణ సరిగా ఉండకపోవటంతో రహదారిపై కూడా చెత్త పేరుకుపోయేది. గుట్టలుగా చెత్త ఉండే ప్రాంతాన్ని పచ్చని పార్కుగా మార్చడం పట్ల నగరవాసులు సంతోషిస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పార్కు రూపంలో పరిష్కారం దొరికిందని చెబుతున్నారు. ఇంతకుముందు చెత్త ఉండడంతో పాములు, ఎలుకలు, దోమలతో అనేక ఇబ్బందులు పడేవాళ్లమని.. పార్కు నిర్మాణంతో పరిస్థితి మారిందని అంటున్నారు.

"ఇక్కడ చెత్త ఉండటంతో విపరీతమైన చెడు వాసన వచ్చేది.విజయవాడలోనే అతిపెద్ద ఐకానిక్ పార్కు ఇక్కడ ఏర్పాటు చేయడం వలన వాసన, దోమలు,ఎలుకలు బాధ తప్పింది. మాకు చాలా ఆనందంగా ఉంది." -స్థానికుడు.

"ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో వాసనతో పాటుగా దోమలు, ఎలుకలు, పాములు ఉండేవి. వాటితో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టేది కాదు. చిన్న పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఇక్కడ పార్కును నిర్మిస్తుండటంతో మా సమస్యకు పరిష్కారం లభించినట్లయింది." -స్థానికురాలు.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నారు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. పార్కుల అభివృద్ధికి రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు బందర్ రోడ్డులోని పార్కు, పాయకాపురం వద్ద పార్కు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

"భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని...జనసాంద్రత ఎక్కువగా ఉన్న స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం, వారికి ఆహ్లాదాన్ని అందించడం కోసం పార్కులను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ప్రభుత్వం 20 కోట్లు వెచ్చిస్తోంది." - విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

అధిక జనభా నివసించే ప్రాంతాల్ని గుర్తించి ఆ ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నామని.. ఇప్పటికే ఉన్న రాఘవయ్య పార్కు, లెనిన్‌ పార్కు, రాధానగర్‌ పార్కులను మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు నగరపాలక అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ADDITIONAL LOANS: అదనపు రుణాలు పొందేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ABOUT THE AUTHOR

...view details