కొండపల్లి మైనింగ్పై తెదేపా నేత పట్టాభి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అబద్ధాలను నిజం చేయాలని తెదేపా నేతలు ప్రయత్నించటం దారుణమన్నారు. వైఎస్ హయాంలో లోయ గ్రామంలో 143 సర్వే నెంబర్ను సృష్టించారని పట్టాభి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 1993 లోనే ఓ వ్యక్తి 143 సర్వే నెంబర్లో మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని గుర్తు చేశారు. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందన్నారు. 143 సర్వే నెంబర్ ఎప్పటినుంచో ఉందనటానికి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 45 ఏళ్లుగా లోయ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని..అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. లోయలో గత ప్రభుత్వంలో ఇచ్చిన విచారణ నివేదికల ప్రకారమే మైనింగ్ అనుమతులు ఇచ్చారన్నారు.
చూస్తూ ఊరుకోబోం..
తనపై బురద జల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా ఏడాదిన్నరగా పని చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తున్నట్లైతే..ఆధారాలతో బయటపెట్టాలన్నారు. స్పిన్నింగ్ మిల్లులకు ఆర్థికసాయం చేయిస్తామని గత ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈల నుంచి ఇద్దరు మంత్రులు రూ. 9 కోట్లు తీసుకుని మోసం చేశారని కృష్ణప్రసాద్ ఆరోపించారు. తెదేపా నేతలు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని..,త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశారన్నారు. అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్ వివాదం