కృష్ణా జిల్లా మార్క్ఫెడ్ తీరుతో మెక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ క్రాప్లో పంటను నమోదు చేసుకున్న రైతులే.. మార్క్ఫెడ్లో అమ్ముకునే అవకాశం ఉంది. కొందరు ఇప్పటికీ పేర్లు నమోదు చేసుకోని రైతన్నలు.. తీవ్ర ఆవేదనకు లోనవుతన్నారు. కళ్లం నుంచి పంటను రైతు భరోసా కేంద్రానికి తరలించడం.. ఆ తర్వాత మార్క్ఫెడ్కు సొంత ఖర్చులతో పంటను తరలించడం రైతకు పెను భారంగా మారుతున్నాయి.
నమోదు చేసుకోవలనే నిబంధన.. రైతు పాలిట శాపం
మార్క్ఫెడ్లో పంటను అమ్ముకోవాలంటే.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రంలో నమోదుచేసుకోవాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇందుకోసం మార్క్ఫెడ్ అధికారులు పది రోజులకు ఒకసారి షెడ్యూలు ఇస్తున్నారు. ఈ లోపే.. అకాల వర్షాల కారణంగా కళ్ళాల్లోనే పంట ఉండిపోతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు. సమయం తక్కువగా ఉండటం.. రైతు భరోసా కేంద్రాలకు తెచ్చిన మొక్కజొన్నలు గోడౌన్కు తరలించటానికి రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకోవడం రైతుకు భారంగా మారనుంది.
సొంత ఖర్చులతో తరలింపు..
మొక్కజొన్నలు తరలించటానికి వేలాది రూపాయలు రవాణా చార్జీలు చెల్లించి రైతులు నష్టపోతున్నారు. మార్క్ఫెడ్ నుంచి లారీలు రాకపోవడంతో.. చేసేదేమి లేక సొంతంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాల సహాయంతో పంటను రైతు భరోసా కేంద్రం నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. కొందరైతే దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే రవాణా చేసుకున్న వాటికి చార్జీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని.. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు ప్రక్రియను త్వరిగతన పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.