తెదేపా కార్యకర్తకు కత్తిపోట్లు... లోకేశ్ ఆగ్రహం..! కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. చాకు సలీమ్ వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వైకాపా కార్యకర్తే... తెదేపాకు చెందిన సలీమ్పై దాడి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆరోపించారు. క్షతగాత్రుణ్ని పరామర్శించిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం సలీమ్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లోకేశ్ ఆగ్రహం
జగ్గయ్యపేట ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఇంకెంతమంది నెత్తురు చిందించాలని లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వ పాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారన్న హోంమంత్రి.. ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సలీమ్ను కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా అని ప్రశ్నించారు. జగన్ పాలన ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, గూండాల దాహానికి తెదేపా కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారాని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
గ్రామ వాలంటీర్పై దాడి.. తెదేపా కార్యకర్తల పనే అని ఆరోపణ