ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2020, 12:46 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్ ఆ ఊరికి మంచి చేసింది!

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్​డౌన్ కారణంగా అనేక రంగాలు కుదేలవగా.... అభివృద్ధి కార్యక్రమాలు పడకేశాయి. అయితే ఆ ఊరికి మాత్రం లాక్​డౌన్ కాలం ఉపకారం చేసింది. ఏళ్లుగా ఊర్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామస్థులు, యువత సంఘటితమై... ఐకమత్యాన్ని చాటేలా చేసింది. అభివృద్ధికి బాటలు వేసేలా చేసింది. ఇంతకీ ఆ ఊరేంటి... జరిగిన అభివృద్ధేంటి....అందులో యువత పాత్రేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

corona helps to village development
లాక్​డౌన్​తో ఆ ఊరు బాగుపడింది

లాక్​డౌన్​తో ఆ ఊరు బాగుపడింది!

ఇది కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామం. అన్ని గ్రామాల్లోలానే ఈ ఊరికీ కొన్ని సమస్యలున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారం కాక అలాగే ఉండిపోయాయి. కరోనా విజృంభిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో మార్చి 22న జనతా జర్ఫ్యూ విధించారు. సరిగ్గా జనతా కర్ఫ్యూకి కొన్ని రోజుల ముందు విదేశాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కొంత మంది గ్రామానికి వచ్చారు.

కర్ఫ్యూ, లాక్​డౌన్​తో విధులకు వెళ్లేందుకు వీలులేని కారణంగా.. వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మిత్రుల సాయంతో ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఎవరో వస్తారు... ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ కూర్చోకుండా.... ఆ సమస్యల పరిష్కారానికి గ్రామస్థులు, యువత కలిసి నడుం బిగించారు. ముందుగా గ్రామం పేరుతో ఉన్న ఫేస్ బుక్ లో ఊరి సమస్యలు, వాటికి పరిష్కారం తెలపాలంటూ సందేశం ఉంచారు. అలా పలువురు నుంచి సమస్యలు తెలుసుకుని..... 90 మంది కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.

అలా ఊర్లో సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను కనుగొని ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ముందుగా చిన్న చిన్న సమస్యలు గుర్తించి... గ్రూపులోని సభ్యులే తలో చెయ్యి వేసి వాటిని పూర్తి చేశారు. గ్రామంలో గ్రంథాలయం సమీపంలో... గతంలో రోడ్లపై మురుగు నీరు వెళ్లే అవకాశం లేక సిమెంట్ రోడ్డుపైనే ప్రవహించేది. దీనికి తోడు సిమెంటు రోడ్డుపై పగుళ్లు ఏర్పడిన కారణంగా.. వాహనచోదకులు కొన్నిసార్లు ప్రమాదాలకు గురయ్యారు.

ఈ సమస్యకు పరిష్కారంగా.. మురుగు నీరు రోడ్డుపై ప్రవహించకుండా ఇరువైపులా కాలువను వెడల్పు చేశారు. పగుళ్లకు.... తారుతో పూతవేశారు. సిమెంట్ రోడ్డు మార్జిన్ సరిగా లేక ప్రమాదాలకు కేంద్రంగా మారగా.. అక్కడ మట్టిపోసి సమస్యను పరిష్కరించారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఉన్న చిన్న తూములను తొలగించి వాటి స్థానంలో పెద్ద తూములు ఏర్పాటు చేసి మురుగునీరు సులభంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

ఇక గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న పంట పొలాలకు వెళ్లే దారిని బాగుచేయాలని సంకల్పించారు. గతంలో ఈ దారి పూర్తిగా గుంతల మయంగా ఉండటం, వర్షం వస్తే రాకపోకలు సాగించేందుకు అస్సలు వీలుకాని కారణంగా.. ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామస్థులే రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రైతులందరి నుంచి తలాకొంత నగదు పోగు చేసి 3 కిలోమీటర్ల మేర సొంతంగా గ్రావెల్ తో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్థులు, యువత, రైతులే కూలీలుగా మారి అందరూ కలిసి పనిపూర్తి చేశారు.

ఊరిలోని సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలో భాగస్వాములైన యువత, గ్రామస్థులను సంఘటితం చేయడంలో కిరణ్ కుమార్ ది కీలకపాత్ర. వృత్తిరీత్యా విశాఖపట్నంలో ఉండే కిరణ్... లాక్ డౌన్ పుణ్యమా అని గ్రామంలో ఉంటడం, అదే సమయంలో ఊరి సమస్యలు తన దృష్టికి రావడంతో... అందరి భాగస్వామ్యంతో వాటిని పరిష్కరించుకోగలిగామని చెబుతున్నారు.

ఇప్పటి వరకు తాము చేసిన పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరలేదని.... గ్రామస్థులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి ద్వారానే చేసుకోగలిగామంటున్నారు. ఊరికి డంపింగ్ యార్డు లేని కారణంగా... చెత్త తరలింపు పెద్ద సమస్యగా మారింది. డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని కేటాయించాలంటూ అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు.

గ్రామానికి తాగునీరు అందించే మంచినీటి ట్యాంకు మూడేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉన్న కారణంగా గ్రామస్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని.. ట్యాంకు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా... అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్రభుత్వం స్పందించి.. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రతీదానికీ ప్రభుత్వాలను నిందించడం కన్నా.. యువత విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా.. ముందు తమ పరిధిలోని సమస్యలపై దృష్టిపెడితే ప్రతి గ్రామం ఆదర్శవంతంగా తయారవుతుందని వీరు నిరూపించారు. తమను చూసి పది మంది స్పందించి వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేదే తమ ఉద్దేశమని.. పురుషోత్తపట్నం గ్రామస్థులు చెబుతున్న మాట.

ఇదీ చదవండి:

సొంత గూటికి.. ఒట్టి చేతులతో!

ABOUT THE AUTHOR

...view details