కృష్ణా జిల్లాలోని మెుత్తం 17 కేంద్రాల్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 63 శాతం పోలింగ్ శాతం నమోదై ఉండడంతో..చాలాచోట్ల సాయంత్రానికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తైంది.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లోనికి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో అరకిలోమీటరు దూరం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు 144 సెక్షను అమలు చేసి వాహనాలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ పరిషత్ ఎన్నికల్లో పోటీలో లేకపోవటంతో జిల్లాలోని మెుత్తం 41 జెడ్పీటీసీ స్థానాల్లో 40 స్థానాలను అధికార వైకాపా గెలిచింది. 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 వైకాపా విజయం సాధించింది. తెదేపా 63, జనసేన 9, భాజపా 1, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసు అధికారులు పదేపదే సూచించినా ఒకటి రెండు చోట్ల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి నాగమణి రెండు ఓట్ల తేడాతో గెలిచారు.ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించగా ఒక్క ఓటు ఆధిక్యం కనిపించింది. మళ్లీ మూడోసారి కూడా రీకౌంటింగ్ చేయగా. ఈసారి మూడు ఓట తేడా కనిపించింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి పది ఓట్లతో గెలుపొందగా..రీకౌంటింగ్ చేశారు. మళ్లీ తెదేపా అభ్యర్థే ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాపులపాడు మండలం ఓగిరాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్ కి పట్టుపట్టగా వైకాపా అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం వచ్చింది. దీంతో మూడోసారి మళ్లీ లెక్కించారు. చివరికి తెదేపా అభ్యర్థి సుబ్బారావు రెండు ఓట్ల తేడాతో గెలిచారు.
పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ శ్రేణులు కొన్నిచోట్ల ఉల్లంఘించాయి. అవనిగడ్డలో వైకాపా శ్రేణులు బాణసంచా కాల్చి, వందలాది మందితో ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి డీజే బాక్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.