ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Land Ceiling: సీలింగ్‌ భూములపై సర్కారు కన్ను... క్రమబద్ధీకరణ పేరిట నోటీసులు - పట్టణ భూ పరిమితి చట్టం-1976

తమ కష్టార్జితంతో దశాబ్దాల కిందట స్థలం కొని ఇళ్లు నిర్మించుకున్నారు. హక్కు పత్రాలూ ఉన్నాయి. వాటి మీద రుణాలు పొందారు.. వారసులకూ హక్కులు దఖలు పడ్డాయి. కానీ ఉన్నట్టుండి అవి సీలింగ్‌ భూములని.. కోట్ల రూపాయలు కట్టి క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం నుంచి వస్తున్న నోటీసులు వేలాది కుటుంబాల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి.

Land ceiling issue
Land ceiling issue

By

Published : Mar 1, 2022, 11:06 AM IST

Updated : Mar 1, 2022, 7:25 PM IST

తమ కష్టార్జితంతో దశాబ్దాల కిందట స్థలం కొని ఇళ్లు నిర్మించుకున్నారు. హక్కు పత్రాలూ ఉన్నాయి. వాటి మీద రుణాలు పొందారు.. వారసులకూ హక్కులు దఖలు పడ్డాయి. కానీ ఉన్నట్టుండి అవి సీలింగ్‌ భూములని, కోట్ల రూపాయలు కట్టి క్రమబద్దీకరించుకోవాలని ప్రభుత్వం నుంచి వస్తున్న నోటీసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని వేలాది కుటుంబాల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి. తాతల కాలం నుంచి ఉంటున్న స్థలాలకు.. డబ్బులు కట్టాలని నోటీసులు వస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పట్టణ భూ పరిమితి చట్టం-1976 కింద సీలింగ్, మిగుల భూముల క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడమే దీనంతటికీ ప్రధాన కారణం.

సీలింగ్‌ భూములపై సర్కారు కన్ను

నిరుపేదలనే కనికరమూ లేకుండా..

సీలింగ్ భూములకు కోట్ల రూపాయలు కట్టి క్రమబద్దీకరించుకోవాలని రాష్ట్రం ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధరకు ఒకటిన్నర రెట్లు కట్టమని నోటీసుల్లో పేర్కొంది. 2008 జూన్‌లో జారీ చేసిన 747జీవో ప్రకారం ఈ భూముల క్రమబద్ధీకరణకు ఉన్న మినహాయింపులనూ తొలగించేసింది. దీని స్థానంలో 2021 జనవరి 31న సవరణలతో 36 జీవో తెచ్చి.. భూముల బదలాయింపును కోట్లతో కూడుకున్న వ్యవహారంగా మార్చేసింది. అప్పట్లో ఇచ్చిన జీవోలో ఆక్రమితదారులపై భారం పడకుండా పలు మినహాయింపులు ఇవ్వగా.. ఇప్పటి జీవోలో కేవలం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుపేదలనే కనికరమూ లేకుండా.. గతంలో ఉన్న ఉచితం అనే నిబంధన తొలగించి పెద్ద మొత్తంలో వసూళ్లకు సంకల్పించారు. నోటీసులు అందుకున్న వారు చెల్లించాల్సిన మొత్తం చూస్తే.. ఇంటిని వదులుకోవడమే మేలనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. ఒకటికి మూడు, నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సమయంలో.. వస్తున్న నోటీసులతో వేలాది కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి.

ఇన్నాళ్లూ లేని భూ పరిమితుల చట్టం ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారో...

పట్టణ భూ పరిమితి చట్టం-1976 కింద నిషేధిత జాబితాలో ఉంటే ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ లేని భూ పరిమితుల చట్టం ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారో... తమకే ఎందుకు వర్తింపజేస్తున్నారో.. తెలియడం లేదని వాపోతున్నారు. తమ భూములు ఆ చట్టం కిందకు ఎప్పుడొచ్చాయనే విషయమూ ఇప్పటి వరకు తెలియదని పేర్కొంటున్నారు. విజయవాడ, సమీప మండలాల్లో కలిపి అర్బన్‌ సీలింగ్‌ యాక్టు కింద 1225 మందిని గుర్తించి మిగులు భూమి ఆక్రమణ కింద నోటీసులు ఇస్తున్నారు. దీనిలో భాగంగా పెనమలూరులో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లకు సంబంధించి 20 మందికి నోటీసులు జారీ అయ్యాయి. పోరంకిలో ఎకరం, కానూరులో ఎకరం విస్తీర్ణంలోని ప్లాట్లు గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కొంతమంది నోటీసులు తీసుకోవడం లేదు. దీంతో వీఆర్‌ఓలు ఇంటి గేటుకు అతికించి వస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పశ్చిమ మండలంలో 385, గ్రామీణంలో 45, మధ్య మండలంలో 147, ఉత్తర మండలంలో 500, తూర్పు మండలంలో 128 నోటీసులు జారీ అయ్యాయి.

గతంలోనే చెల్లించిన డబ్బు ఏమైందో...

విజయవాడ కోనేరువారి వీధికి చెందిన విశ్రాంత అధికారి వేమూరి బాబురావు అమ్మ 1979 సంవత్సరంలో 586 గజాల స్థలం కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, ఇల్లు నిర్మించారు. ఆమె మరణానంతరం ఆస్తుల విభజనకు వెళ్లగా.. పట్టణ భూపరిమితి చట్టం ప్రకారం ఈ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. దీంతో 747 జీవోకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకునేందుకు 2021 అక్టోబరులో 5.50 లక్షలు చెల్లించి, దరఖాస్తు చేశాం. మళ్లీ అదే ఇంటికి తాజాగా నోటీసు జారీ చేశారు. క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం రూ.3 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గతంలోనే చెల్లించిన డబ్బు ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఇలా అనేక మంది పరిస్థితి ఇలానే ఉంది.

బేసిక్‌ విలువపై 1.50 రెట్లు చెల్లించాలంటూ...

విజయవాడలో 1972లో ఏర్పాటైన ఎస్‌బీహెచ్‌ కాలనీలోని 28ప్లాట్ల యజమానులకు పట్టణ భూపరిమితి చట్టం కింద నోటీసులు ఇచ్చారు. 1976లో చట్టం వచ్చే నాటికే అక్కడ ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. తర్వాత గృహాలు చాలామంది చేతులు మారాయి. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు. తాజాగా పట్టణ భూపరిమితి చట్టం కింద నోటీసులు రావడంతో అక్కడి ఇళ్ల యజమానులు కలవరపడుతున్నారు. ఈ ప్రాంతంలో చదరపు మీటరు 42వేల చొప్పున ఉంది. దీనికి 1.5 రెట్లు చెల్లించాలంటే.. మొత్తం ఇంటిని అమ్మినా అంత రాదని పేర్కొంటున్నారు. 2008 జూన్‌ 18న జారీ చేసిన 747 జీవో ప్రకారం.. విజయవాడ పటమట ప్రాంతంలో 300 చదరపు మీటర్ల లోపు ఉంటే చదరపు మీటరుకు 3వేల 970 చెల్లించాలి. 747 జీవో స్థానంలో ఈ ఏడాది జనవరి 31న జారీ చేసిన 36వ జీవో ప్రకారం.. అదే ప్రాంతంలో చదరపు మీటరు విలువ ప్రస్తుతం కనీసం 40వేలు పైనే ఉంది. నోటీసు ఇచ్చిన స్థలం క్రమబద్ధీకరించుకోవాలంటే దీనిపై 1.5 రెట్లు చెల్లించి.. సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

అప్పుడు రూ రూ. 60వేలు... ఇప్పుడు కోటి పైనే..

విజయవాడ పక్కనున్న పెనమలూరులో 300 చ.మీ వరకు పరిశీలిస్తే.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారైతే 100 చ.మీ వరకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన పనిలేకుండానే క్రమబద్దీకరిస్తారు. మిగిలిన 200 చ.మీ. విస్తీర్ణానికి చదరపు మీటరుకు 300 చొప్పున రూ. 60వేలు చెల్లించాల్సి వస్తుంది. ఇందులోనూ రిజిస్ట్రేషన్‌ తేదీ నుంచి ఏడాదికి 3 శాతం చొప్పున తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడైతే అక్కడ చదరపు మీటరు రూ.35వేల విలువ ఉంది. తాజా నిబంధనల ప్రకారం అక్కడ ఉండేది పేద కుటుంబమైనా సరే.. 300 చ.మీ. విస్తీర్ణానికి కోటి పైనే చెల్లించాలి.

747 ఉత్తర్వులోని నిబంధనల ప్రకారం.. స్థలం కొనుగోలు నాటి నుంచి క్రమబద్ధీకరించుకునే సమయం వరకు.. మొత్తం విలువపై ఏడాదికి మూడు శాతం చొప్పున, గరిష్ఠంగా 25 ఏళ్ల వరకు తగుదల వర్తింపజేశారు. అంటే 2003 సంవత్సరంలో ఇల్లు కొనుక్కుని 2008 సంవత్సరంలో క్రమబద్ధీకరించుకుంటే.. అయిదేళ్లకు 15 శాతం తగింపు వస్తుంది. అంటే చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.6లక్షలుంటే.. 15 శాతం తగ్గింపు ప్రకారం రూ.90వేలు మినహాయిస్తారు. తాజా జీవోలో ఈ నిబంధన తీసేశారు. నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. వసూలు చేసే మొత్తాన్ని నిర్దేశిత పద్దుల్లో జమ చేయడం ద్వారా.. ప్రత్యేకించి ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించాలని అప్పట్లో పేర్కొనగా.. ఇప్పుడు దాన్నీ తీసేశారు. నోటీసులో పేర్కొన్న మొత్తాలను చూస్తే.. 580 గజాలకే రూ. 3.50 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే అదనంగా రూ.30 లక్షలపైనే చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఒకసారి కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఇంటిని.. మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంట.. ఇదేం పద్ధతో తెలియడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయిన ఇంటిని రెండోసారి చేసేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా? అనే ప్రశ్నలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంలోనూ ఇదే సమస్య ఎదురవుతోందని అధికారులు సైతం పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

ఓటీఎస్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు రుణాలందేలా చూడాలి: సీఎం జగన్

Last Updated : Mar 1, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details