ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 21, 2020, 1:57 PM IST

ETV Bharat / state

వరదలో మునిగిన కారుకు బీమా వర్తిస్తుందా?

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కాలనీలు జలమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, వాహనాలు వేల సంఖ్యలో కాగితపు పడవల్లా నీళ్లలో తేలిపోయాయి. కొన్ని మునిగిపోయాయి. ఇంకొన్ని బురదలో చిక్కుకున్నాయి. నీళ్లు వెళ్లిపోయిన వెంటనే వాహనాల సర్వీస్ సెంటర్లకు చేరుతున్నాయి. ఈ వాహనాలకు బీమా వర్తిస్తుందా? లేదా? అనేది వాహనదారుల మదిని తొలచివేస్తున్న ప్రశ్న. ఒకవేళ బీమా వర్తిస్తే ఏ మేరకు ఉపశమనం కలుగుతుంది? అసలు కారు మామూలు రీతికి వస్తుందా అన్నది ఇప్పుడు వాటి యజమానులను వేధిస్తోన్న ప్రశ్నలు.

insurence for cars
వరదలో మునిగిన కారుకు బీమా వర్తిస్తుందా?

వరదలో మునిగిన కారుకు బీమా వర్తిస్తుందా?

హైదరాబాద్​లో వరుణుడి ఆగ్రహానికి చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. వేల సంఖ్యలో వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి. కొన్నైతే పడవల్లా నీటిపైన కొట్టుకుపోయాయి. సాధారణంగానే వాహనాలకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వరదల వల్ల కార్లలో చాలా భాగాలు పాడయిపోయే ఆస్కారం ఉంది.

వరదలు ప్రారంభమైనప్పటి నుంచి సర్వీస్ సెంటర్లకు.. నీటిలో మునిగిన వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. 95 శాతానికి పైగా వాహనాలు వరదల్లో మునిగినవి లేక వరదల వల్ల డ్యామేజీ అయినవే వస్తున్నాయని సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు. వీటికి సంబంధించి రిపేరు, సర్వీసింగ్​కు కూడా చాలా సమయం పడుతోంది. ఒకేసారి భారీగా వాహనాలు సర్వీస్ సెంటర్ల వద్ద క్యూ కట్టడం వల్ల ఇలా జరుగుతోందని వారు చెబుతున్నారు.

  • మునిగిన తీరును బట్టి వర్గీకరణ..

వాహనం నీటిలో మునిగిన తీరును బట్టి వర్గీకరిస్తున్నారు సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు. మొత్తం నీటిలో మునిగిన వాహనాన్ని సీ క్యాటగిరీగా, సీట్ స్థాయి వరకు మునిగిన వాహనాన్ని బీ క్యాటగిరీగా, కార్పెట్ వరకు మునిగిన వాహనాన్ని ఏ క్యాటగిరీగా విభజిస్తున్నారు. ఎక్కువగా సీ క్యాటగిరీ వాహనాలే సర్వీస్ సెంటర్లకు చేరుతున్నాయి. బీమా సంస్థలను సంప్రదించి, క్లెయిమ్​ను పరిగణనలోకి తీసుకొని రిపేర్, సర్వీసింగ్ పూర్తి చేయటానికి సమయం పడుతోంది. ఏ క్యాటగిరీ వాహనం 3 నుంచి 5 రోజులు, బీ క్యాటగిరీ వాహనాలకు దాదాపు 3 వారాలు, సీ క్యాటరిగీ వాహనాలకు ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు.

  • తీసుకున్న బీమా బట్టి క్లెయిమ్​..

వాహనంలో చిన్న చిన్న రిపేర్లకే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు వరదల వల్ల వాహనాల్లో ఎలాంటి డ్యామేజీ జరిగింది? ఎంత వరకు ఖర్చువుతుంది? బీమా క్లెయిమ్ అవుతుందా? లేదా? అన్నది వాహనదారులను కలవరపెడుతోంది. వాహనదారులు తీసుకున్న బీమాను బట్టి క్లెయిమ్ అవుతోందని వాహన బీమా నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వాహనానికి సంబంధించి బీమాలో పలు రకాలుంటాయి. అందులో ఒకటి థర్ట్ పార్టీ. థర్డ్ పార్టీ బీమాలో వాహన డ్యామేజీకి సంబంధించి ఎలాంటి బీమా ఉండదు. ఇది కేవలం వాహనం వల్ల ఇతరులకు, ఇతర వాహనాలకు కలిగిన డ్యామేజీకి మాత్రమే వర్తిస్తుంది. బీమా రెగ్యులేటరీ ప్రకారం రోడ్డుపై తిరిగే ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనితో దాదాపు అన్ని వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ఉంటుంది.

రెండో రకం.. కాంప్రీహెన్సీవ్ బీమా. ఇందులో థర్డ్ పార్టీతో పాటు వాహన డ్యామేజీ నష్టానికి సంబంధించి బీమా ఉంటుంది. వాహన వయస్సు పెరుగుతున్న కొద్ది దాని విలువ తగ్గిపోతుంది. ఈ తగ్గిన విలువ ఆధారంగా కాంప్రిహెన్సీవ్ బీమాలో కవరేజీ ఉంటుంది. జీరో డిప్ అనేది మరో పాలసీ. ఇందులో వాహన భాగాలపై విలువ తగ్గింపును పరిగణనలోకి తీసుకోకుండా వంద శాతం విడిభాగాల విలువకు కవరేజీ ఉంటుంది. కాంప్రిహెన్సీవ్, జీరో డిప్​లో ఇంజిన్‌కు బీమా ఉండదు.

  • జీరో డిప్​ పాలసీ వారికి పూర్తిగా బీమా..

చట్టపరంగా తప్పనిసరైన థర్డ్ పార్టీతోనే కొంత మంది వాహనాలను నడిపిస్తుంటారు. వీరి వాహనాలు వరద నీటిలో మునిగిపోయినట్లైతే.. సొంత ఖర్చుతో వాటిని రిపేరు చేయించుకోవాల్సిందే. సాధారణంగా చాలా మంది వాహనాలపై కాంప్రెహెన్సీవ్ ప్లాన్ తీసుకుంటారు.

కొంతకాలంగా జీరో డిప్ పాలసీలు తీసుకోవటం ప్రారంభమైనప్పటికీ.. రోడ్లపై ఉన్న వాహనాల్లో తక్కువ వాహనాలకు మాత్రమే జీరో డిప్ పాలసీలు ఉండే అవకాశం ఉన్నట్లు వాహనం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కాంప్రిహెన్సీవ్ బీమా ఉన్న వారి వాహనం వరదల్లో ఉన్నట్లయితే కేవలం విడి భాగాలపై 20 నుంచి 40 శాతం తక్కువ మొత్తం క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. జీరో డిప్ ఉన్న వాహనాలకు విడిభాగాలపై పూర్తిగా బీమా వస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ ఉన్న వారికి ఇంజిన్​కు సంబంధించి కూడా రిపేరు ఖర్చులను బీమా సంస్థలే భరిస్తాయి.

  • వరదలో మునిగితో వాహనం స్టార్ట్​ చేయొద్దు..

వాహనం పార్క్ చేసి ఉంచినప్పుడు ఇంజిన్​లోకి నీరు ప్రవేశించదని సర్వీస్ సెంటర్ల వాళ్లు చెబుతున్నారు. ఒకవేళ దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లైతే ఇంజిన్​లోకి నీరు ప్రవేశిస్తుందని, దాని వల్ల ఇంజిన్ డ్యామేజీ అవుతుందని వారు అంటున్నారు. సాధారణంగా ఇంజిన్​కు సంబంధించి రిపేరు ఖర్చులు భారీగా ఉంటాయి. ఇంజిన్ డ్యామేజీ అయినట్లైతే.. ఇంజిన్ ప్రొటెక్షన్ లేని వాహన యజమాని జేబుకు చిల్లు పడాల్సిందే.

బురదలో ఆరిపోయిన అనంతరం, వరద నీరు వెళ్లిపోయిన అనంతరం వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. వీలైనంత త్వరగా వాహనాన్ని సర్వీస్ సెంటర్​కు పంపించాలి. అక్కడ బీమా క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభౌతుంది. పాలసీకి అనుగుణంగా బీమా కంపెనీలు క్లెయిమ్ అందిస్తాయి. ఇంజిన్ ప్రొటెక్షన్ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంజిన్ డ్యామేజీకి సంబంధించి బీమా క్లెయిమ్ అవుతుంది. కాంప్రిహెన్సీవ్ బీమా, జీరో డిప్ ఉన్న వారు మాత్రం వాహనాన్ని ప్రారంభించకుండా సర్వీస్ సెంటర్​కు తీసుకెళ్లినట్లైతే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు.

ఇదీ చదవండి:

వరద బాధితుల కోసం పవన్..​ రూ.కోటి విరాళం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details