ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం విషయంలో నవయుగ వ్యాజ్యానికి విచారణార్హత ఉంది' - high court orders on polavaram project news

పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంపై నవయుగ సంస్థతో ఏపీ జెన్‌కో చేసుకున్న ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేసి... పనులను మూడో వ్యక్తికి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒప్పందం రద్దును సవాలు చేస్తూ నవయుగ దాఖలుచేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని స్పష్టం చేసింది.

'పోలవరం విషయంలో నవయుగ వ్యాజ్యం విచారణార్హత ఉంది'

By

Published : Nov 22, 2019, 4:10 AM IST

పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దుపై స్టే ఎత్తివేత తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. పీహెచ్​ఈపీ పనులు మరొకరికి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. నవయుగ వ్యాజ్యంపై తుది విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది.

జోక్యం చేసుకోవచ్చు

నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌పై అనుమతి వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వ విధానం అనుసరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరు పార్టీల మధ్య ఒప్పంద నిబంధన ఉన్నప్పటికీ... అన్యాయం జరిగినప్పుడు, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. పీహెచ్​ఈపీ విషయంలో ఏపీజెన్‌కో, నవయుగ మధ్య జరిగిన ఒప్పందంలో వివాదం తలెత్తితే మధ్యవర్తిత్వ విధానం అనుసరించాలనే నిబంధన ఉన్నా... హైకోర్టును ఆశ్రయించడంపై నిషేధం లేదని అభిప్రాయపడింది. నవయుగతో ఒప్పందం రద్దు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు... హక్కుల పరిరక్షణ కోసం ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

తీర్పులోని అంశాలు

ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మొదట్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సింగిల్ జడ్జి.... వ్యాజ్యంలోని అంశాలను పరిశీలించి అదేశాలు జారీ చేశారని ధర్మాసనం తెలిపింది. కానీ వ్యాజ్యంలోని అంశాల్లోకి వెళ్లకుండా... స్టే ఎత్తివేతకు మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. అనుబంధ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నవయుగ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని ఒక సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చినప్పుడు, ఆ దృక్పథానికి విరుద్ధంగా మరో సింగిల్ జడ్జి వ్యవహరించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. నవయుగ వ్యాజ్యానికి విచారణార్హత లేదంటూ... స్టేను ఎత్తివేస్తూ అక్టోబర్ 31న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని చెప్పింది. పీహెచ్​ఈపీ పనుల్ని మూడో వ్యక్తికి అప్పగించొద్దంటూ ఈ ఏడాది ఆగస్టు 22న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఖరారు చేస్తున్నామని తీర్పిచ్చింది. స్టే ఎత్తివేతను సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చూడండి:

ఆంగ్ల మాధ్యమానికి తెదేపా వ్యతిరేకం కాదు: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details