నానితో తలపడుతున్న అవినాష్ కృష్ణా జిల్లా గుడివాడలో గెలుపు 2 ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో చేస్తున్న పోరు రసవత్తరమైంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఎంతమంది పోటీలో ఉన్నా ఈ ఇద్దరి మధ్యే వార్. పదునైన ప్రసంగాలకు ఇద్దరూ ఇద్దరే. నాలుగోసారీ గెలుస్తా...!
నాలుగోసారి గెలిచి గుడివాడ సీటు అధినేత జగన్కు కానుక అందిస్తానంటున్నారు కొడాలి నాని. 2004, 2009లో తెదేపా తరఫున విజయం సాధించారు. అనంతరం వైకాపాలో చేరి 2014లో హ్యాట్రిక్ అందుకున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నానని, వారి అభిమానమే గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. నియోజకవర్గంలో కొన్ని వర్గాల అండ, యువతలో ఫాలోయింగ్, ఎన్నికల వ్యూహాల్లో అనుభవం, అధికారంలోకి వస్తే నెరవేరుస్తామంటున్న 'నవరత్నాల' హామీలు.. తమకు కలిసొస్తాయని ఆ పార్టీ అంచనా. గుడివాడ, నందివాడ మండలాల్లో నానికి మంచి పట్టుంది. హైదరాబాద్లో నివాసం ఉంటూ... నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం.
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధితో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని దేవినేని అవినాష్ ఇస్తున్న హామీకి.. ప్రజలు ఆకర్షితులవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అవినాష్ను పోటీలో దింపడం ప్రయోగంగానే భావిస్తున్నాయి తెదేపా వర్గాలు. బెజవాడ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకన్న దేవినేని వారసుడిగా... తెదేపా కంచుకోటలో జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పది పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో 8 సార్లు తెలుగుదేశమే గెలిచింది. పటిష్ఠమైన పార్టీ యంత్రాంగం, సీనియర్ నేతల అండ, ప్రభుత్వ సంక్షేం, అభివృద్ధి పథకాలు అనినాష్కు కలిసిరానున్నాయి. గుడివాడ పురపాలక సంఘం ఛైర్మన్తోపాటు 12 మంది కౌన్సిలర్లు తెదేపాలో చేరడం అదనపు బలం కానుంది. స్థానికేతరుడనే ప్రచారం, ఎన్నికల బరిలో తొలిసారి కావడం బలహీనతలుగా చెప్పుకుంటున్నారు విశ్లేషకులు.
ఇవీ చూడండి:ఒంగోలు ఎవరిని వరించునో..?