ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త పాలకవర్గం కొలువుదీరిన వేళ.. చేయిచేయీ కలిపితేనే ప్రగతి మాల..! - కృష్ణా జిల్లాలో కొత్త సర్పంచుల వార్తలు

కొత్త పాలకవర్గం పల్లె ఒడిలో కొలువుదీరింది. రాజకీయ వ్యూహాలు.. ఒత్తిళ్లు.. ఒడుదొడుకుల్ని దాటుకుని.. ప్రజాభిమానం చూరగొని సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొంది ఇటీవలే గద్దెనెక్కారు. రాజకీయాలపై ఆసక్తికి తోడు.. ప్రజాసేవ చేసి మన్ననలు పొందడంలోనే అసలైన సంతృప్తి దక్కుతుంది. అభివృద్ధి పనులకు చేయిచేయీ కలిపి.. తమలోని సరికొత్త ఆలోచనలకు రెక్కలు తొడగాల్సిన సమయమిది. ఆ దిశగానే ప్రతి అడుగూ పడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వివిధ రూపాల్లో నిధులు వస్తుండగా... మరోవైపు స్థానికంగానే ఇతరత్రా మార్గాల్లో నిధులు సమకూర్చుకోవచ్ఛు. ఇలా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రగతి పూలు పూశాయి. ఓ సారి వాటిని మననం చేసుకుందాం.

grama panchayath election
పల్లె ఒడి

By

Published : Feb 28, 2021, 3:52 PM IST

పల్లె ఒడి

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులోని కలిదిండి మండలం శివారున ఉంటుంది తాడినాడ గ్రామం. గత పాలకులు, నాయకులు, ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. తాడినాడ ప్రస్తుత జనాభా 5000 మంది కాగా, ఒకప్పుడు బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన బైర్రాజు ఫౌండేషన్‌ గ్రామ వికాస సమితి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న నంబూరి వెంకటరామరాజు(తాడినాడ బాబు), అప్పటి సర్పంచి కొత్తపల్లి రంగరాజు, ఇతర పెద్దల చొరవతో ప్రత్యేక నిధులను రాబట్టారు. ఫౌండేషన్‌ పెట్టిన షరతు ప్రకారం గ్రామస్థులు రూ.20 లక్షలు సేకరిస్తే.. మరో రూ.60 లక్షలు వచ్చే మార్గాన్ని చూపించారు. వాటితో సిమెంటు రోడ్లు, అంతర్గత రహదారి నిర్మించాలన్నది ప్రధాన లక్ష్యం. దాతలు ముందకొచ్చి రూ.20లక్షలు సేకరించడంతో ఫౌండేషన్‌ నుంచి రూ.30లక్షలు, రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ తరఫున రూ.30 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు మంజూరు కావడంతో సుమారు రూ.కోటి సమకూరాయి. దానిలో 75 శాతం అంతర్గత డ్రెయినేజీకి, 25 శాతం నిధులను సిమెంటు రహదారుల నిర్మాణానికి వెచ్చించారు. అప్పటి రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని సైతం ఈ పల్లె అందుకుంది.

చటాకాయ.. అభివృద్ధి ఛాయ

పల్లె ఒడి

చిత్రంలో కనిపిస్తున్నది కైకలూరులోని చటాకాయ గ్రామం. ఇక్కడ 2300 మంది జనాభా ఉన్నారు.

గ్రామంలో ఏ వీధిలో చూసినా మట్టి రోడ్డు కనిపించదు. డ్రెయినేజీ సదుపాయంతోపాటు నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది ఈ గ్రామం. ఆదర్శ పంచాయతీగా 2009లో నిర్మల్‌ పురస్కారం అందుకుంది. మురుగు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కఠినమైన నియమాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో చెత్త వేయకూడదు, అంతర్గత రోడ్లపై పశువులు పేడ వేస్తే.. వాటి యజమానులు పంచాయతీకి అపరాధ రుసుం చెల్లించేలా షరతులు పెట్టుకుని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. దీనివల్ల పారిశుద్ధ్యానికి పెట్టింది పేరుగా ఈ పల్లె స్ఫూర్తి పరిమళాన్ని వెదజల్లుతోంది.

ఇంగిలిపాకలంక.. మురుగు కనిపించదు

పల్లె ఒడి

మండలంలో ఓ మూలకు విసిరేసినట్లుండే కొల్లేరులంక గ్రామమైన ఇంగిలిపాకలంక ఇది. సుమారు 1800 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆక్వారంగంపైనే ఆధారపడి జీవిస్తారు. 60శాతం మంది గ్రామంలో నిరక్ష్యరాసులే ఉన్నా.. నీటి విలువ గురించి వారికి బాగా తెలుసు. అందుకే గ్రామస్థులు వాడే ప్రతి బొట్టూ తిరిగి భూమిలోకే ఇంకేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊళ్లోకి వెళితే ఎక్కడా డ్రెయినేజీ అనేదే కనిపించదు. మురుగునీరు మచ్చుకైనా తగలదు. వాడుక నీరు ఇంటి అవరణలో ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతల్లోకి వెళ్లి భూమిలో ఇంకిపోయేలా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇంటి నిర్మాణమప్పుడే ఆ దిశగా గ్రామస్థులు ఆలోచన చేస్తారు. దీంతో 350 కుటుంబాలకు మురుగు, దోమల బెడద తప్పింది.

భైరవపట్నం.. ఎంతో ఆదర్శం

పల్లె ఒడి

మండవల్లి మండలంలో చైతన్యవంతమైన గ్రామాల్లో భైరవపట్నం ఒకటి. ఇక్కడ 2500 మంది జనాభా ఉన్నారు. గ్రామస్థులు సమష్టిగా కష్టపడుతూ పల్లెను అభివృద్ధి పథంలో నిలిపారు. 2013లో అప్పటి సర్పంచి గాదిరాజు భాస్కరవర్మ సహకారంతో అనేక పనులను చేపట్టారు. విశాలమైన రహదారుల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు, శుద్ధజలం అందించడంపై శ్రద్ధ పెట్టారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ ఆరోగ్య ఉపకేంద్రం, ఆర్బీకే, గ్రామ సచివాలయాలు నిర్మించారు. మంచినీటి చెరువు చుట్టూ ఉన్న గాంధీజీ, అంబేడ్కర్‌, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ప్రతిష్టించి ఆదర్శాన్ని చాటుతున్నాయి.

ఇదీ చదవండి: పాఠశాలలో సౌర విద్యుత్.. నెలవారీ​ బిల్లులకు చెక్!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details