వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష పథకం అమలు కోసం సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కదుర్చుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా కలిసి సమగ్ర సర్వే చేస్తున్నాయని, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎక్కడా చేయలేదన్నారు. 100 ఏళ్లలో సబ్ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి ఉందన్నారు. 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోందన్నారు. 14 వేల సర్వేయర్లను ప్రభుత్వం నియమించిందని.. 9400 మంది సర్వేయర్లు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని, జనవరి 26 కల్లా మిగిలిన వారికి ట్రైనింగ్ పూర్తవుతుందన్నారు.
స్థిరాస్తులన్నింటికీ యూనిట్ ఐడెంటింటీ నంబర్
భూములు, స్థలాలు సహా స్థిరాస్తులన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తామని, రాళ్లు కూడా వేస్తామని, తర్వాత యూనిక్ ఐడెంటిటీ నంబర్తో కార్డు జారీ చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఆ కార్డులో క్యూఆర్ కోడ్ సహా హార్డ్కాపీ ఉంటాయన్నారు. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాప్లు కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తామన్న సీఎం.. విలేజ్ హాబిటేషన్స్కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఇంటి స్థలం, పొలం, లేదా మరో స్థిరాస్తిపై ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్లో అదే గ్రామ సచివాలయంలో పెడతామన్నారు. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తెలియజేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్కు శాశ్వత భూహక్కు లభిస్తుందన్నారు. ఆ మేరకు టైటిల్ ఖరారు చేస్తారని .. ఆ తర్వాత కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో సర్వే
ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న సీఎం జగన్.. ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నట్లు తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా నెట్వర్క్లో ఇవి భాగం అవుతాయన్నారు. కచ్చితమైన కొలతలు ఉంటాయని, ఎర్రర్ అత్యంత సూక్ష్మస్థాయిలో 2 సెం.మీ. అటు ఇటుగా ఉంటుందన్నారు. సర్వే కోసం అత్యాధునిక సదుపాయాలు వాడుతున్నారని, కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతున్నట్లు తెలిపారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నామన్న సీఎం... మొదటి దశను డిసెంబర్ 21న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభమై, జులై 2021 వరకూ మొదటి విడత సాగుతుందన్నారు. ఆగస్టు 2021 నుంచి 6500 రెవెన్యూ గ్రామాల్లో రెండోవిడత ప్రారంభమై, 2022 ఏప్రిల్ వరకూ కొనసాగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగి సర్వే పూర్తవుతుందన్నారు.