ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది నిజం... ఒకే కుటుంబంలో నలుగురు ఐపీఎస్​లు - ఝార్ఖండ్ డీజీపీగా ఏపీ వాసి

కృష్ణా జిల్లా ఆముదార్లంక పేరు చెబితే ఒకప్పుడు గ్రామస్తుల అవస్థలు గుర్తొచ్చేవి. కృష్ణా నదికి ఆవలా ఉండే ఆ గ్రామ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా నది దాటాల్సిందే. పులిగడ్డ-పెనుమూడి వంతెన నిర్మించాక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడా గ్రామం పేరు చెబితే గుర్తొచ్చేది నలుగురు ఐపీఎస్ అధికారులు. ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నతస్థాయి ఎదిగి ఝార్ఖండ్ డీజీపీగా నియమితులైన విష్ణువర్ధనరావు వారిలో ఒకరు.

four-ips-officers-in-one-family-in-krishna-district
ఒకే కుటుంబంలో నలుగురు ఐపీఎస్​లు

By

Published : Mar 19, 2020, 8:00 PM IST

Updated : Mar 19, 2020, 8:46 PM IST

ఇది నిజం... ఒకే కుటుంబంలో నలుగురు ఐపీఎస్​లు

1987 బ్యాచ్ ఝార్ఖండ్ కేడర్​కు చెందిన విష్ణువర్ధనరావు... గతంలో వివిధ రాష్ట్రాల్లో పలుహోదాల్లో సేవలందించారు. ఝార్ఖండ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 18 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామం విష్ణువర్ధనరావు స్వస్థలం. ఆముదార్లంక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన... వరంగల్ ఆర్ఈసీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.

కూతురు, కొడుకు, అల్లుడూ ఐపీఎస్​లే..

విష్ణువర్థన్​రావు కుమార్తె దీపిక, కూమారుడు హర్షవర్థన్, అల్లుడు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్​ అధికారులే. దీపిక ఆంధ్రప్రదేశ్ దిశచట్టం అమలు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. అల్లుడు విక్రాంత్ పాటిల్ విజయవాడ డీసీపీగా, కుమారుడు హర్షవర్థన్ అరుణాచల్​ప్రదేశ్​లో ఏసీబీ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి నలుగురు ఐపీఎస్​లు ఉండటం విశేషం.

గ్రామంలో సామాజిక కార్యక్రమాలు...

విష్ణువర్ధనరావు సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత పదవి చేపట్టడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు రుణం తీర్చుకునేందుకు ఆముదార్లంకలో వారు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఝార్ఖండ్ రాష్ట్ర డీజీపీగా పదోన్నతి పొందిన విష్ణువర్ధనరావుకు ఆముదార్లంక గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి :ఝార్ఖండ్ కొత్త డీజీపీగా ఏపీకి చెందిన వ్యక్తి

Last Updated : Mar 19, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details