ఆధునిక జీవన విధానంలో సామాన్యులు.. సంపన్నుల అనే తేడా లేకుండా అందరి జీవితంలో చెప్పులు ఓ భాగం అయ్యాయి. ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే ఈ చెప్పుల తయారీ రంగం లాక్డౌన్ దెబ్బతో కుదేలయ్యింది. పెళ్లిళ్లు.. ఎండాకాలం... విద్యాలయాల ప్రారంభంతో కళకళలాడే ఈ రంగం ... కరోనా దెబ్బకు కకావికలమయ్యింది.
చెప్పుల తయారీపై లాక్డౌన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే చెప్పుల తయారీకి విజయవాడ పేరొందింది. తయారీ సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఔట్లెట్లతో పాటు, రాష్ట్రంలో 15 వేలకు పైగా చెప్పుల దుకాణాలు ఉన్నట్లు అంచనా.
లాక్డౌన్తో వీరందరూ ఉపాధి కోల్పోయారు. తయారీ సంస్థలో పని చేసే వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పటికే తయారు చేసిన ఉత్పత్తులు గోదాముల్లో ఉండిపోవటంతో... గాలి, వెలుతురు లేక దెబ్బతిన్నాయని వ్యాపారులు వాపోయారు.
కొన్ని సంస్థలు లాక్డౌన్లోనూ సిబ్బందికి జీతాలు చెల్లించాయి. ఆర్థిక మూలాలు దెబ్బ తినటంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని వ్యాపారులు వేడుకుంటున్నారు. అద్దెల వసూలలో ఒత్తిడి లేకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. బ్యాంకు వడ్డీ రేట్లు సైతం తగ్గిస్తే తప్ప తిరిగి కోలుకోలేమని స్పష్టం చేశారు.
ఫుట్వేర్ తయారీ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది చిరు వ్యాపారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విజయవాడ హనుమాన్పేట నుంచే పాదరక్షల ఎగుమతులు జరుగుతాయి. అదే ప్రాంతంలో పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి కావాల్సిన చెప్పులు దొరికే ఈ ప్రాంతం లాక్డౌన్తో బోసిపోయింది. దుకాణాలు దుమ్ము పట్టాయి. దుకాణాల నుంచి ఇతర ప్రాంతాలకు సరకు తరలించే పనిలో ఉండే, హమాలీలు,మినీ రిక్షాలు, ఆటోలు వ్యాను డ్రైవర్లు, ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దుకాణాలు తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతులతో పాటు, ఆర్థిక భరోసా ఇస్తే తప్ప కోలుకోవటం కష్టమని తయారీదారులు, వ్యాపారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:వేడుకల తీరును మార్చిన కరోనా!