కృష్ణా జిల్లావ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించి, పర్యవేక్షించారు. మొదటి విడతలో ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
విజయవాడలో...
విజయవాడలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం జగన్ కొవిడ్ టీకా పంపిణీని ప్రారంభించారు. తొలుత జీజీహెచ్కు చేరుకున్న సీఎం జగన్కి.. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కె. భాస్కర్, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు స్వాగతం పలికారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, సాంకేతిక అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆరోగ్య కార్యకర్త పుష్పకుమారికి వైద్యులు తొలి టీకా వేశారు.
విజయవాడ శివారు కండ్రిక పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్కు వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సులు, ఆశా కార్యకర్తలకు ముందుగా టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత కొన్ని గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.
మచిలీపట్నంలో...
కొవిడ్ మరణాలను అరికట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల వల్ల లక్షల మంది కరోనాను జయించారన్నారు. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికి టీకా వేస్తున్నామని.. విడతల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు.
కంచికచర్ల, వీరులపాడులో...
కంచికచర్ల, వీరులపాడు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంచికచర్లలో 100, వీరులపాడులో 101 మంది ఆరోగ్య సిబ్బందికి తొలిరోజు టీకా వేయనున్నారు. కంచికచర్ల తొలి వ్యాక్సిన్ డాక్టర్ శ్రవణ్ కుమార్కు వేశారు. టీకా వేసేటప్పుడు నొప్పి అనిపించలేదనీ.. అంతా బాగానే ఉందని ఆయన తెలిపారు. ఏదైనా ప్రతికూలత ఎదురైతే వెంటనే నందిగామ వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సిద్ధంగా ఉంచినట్లు పీహెచ్సీ వైద్యులు దీప్తి స్పష్టం చేశారు. మొదట ఆరోగ్య సిబ్బందికి, తర్వాత మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని కంచికచర్ల తహసీల్దార్ విజయ్ కుమార్ వెల్లడించారు.
పమిడిముక్కలలో...