ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా బ్యాంకుల ముందు చెత్తవేసిన చిత్రాలను ట్విటర్ లో పోస్టు చేసి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితోనూ స్వయంగా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో... ఈ ఘటనపై హడావుడిగా స్పందించిన రాష్ట్రప్రభుత్వం... విచారణను ప్రారంభించింది. పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకుడిని విచారణాధికారిగా నియమించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఉయ్యూరు, మచిలీపట్నం, విజయవాడలోని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై.. విచారణ చేపట్టారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలుగా సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు. బ్యాంకర్లతోనూ మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని విచారణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.