బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తెలంగాణలోని ఖమ్మం నగరం సిద్ధమైన సంగతి తెలిసిందే. సభాస్థలి, వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నగరంతో పాటు సభాస్థలికి నలుదిక్కులా సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర ప్రాంతాలన్నీ గులాబీమయంగా మారాయి. అయితే ఈ సభకు జాతీయ పార్టీల నేతలతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఇప్పటికే దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు కేజ్రీవాల్, భగవంత్ మాన్. వారిద్దరికీ హోంమంత్రి మహమూద్ అలీ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం సీపీఐ అధ్యక్షులు డి.రాజా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘన స్వాగతం చెప్పారు. ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు మంత్రి ప్రశాంత్రెడ్డి స్వాగతం పలికారు.
హైదరాబాద్కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆప్ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. కంటి వెలుగు మంచి కార్యక్రమమని కొనియాడారు. మంచి కార్యక్రమానికి మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అవసరమని వెల్లడించారు. తెలంగాణలో ఆప్ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.