ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2021, 9:35 AM IST

ETV Bharat / state

CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్​ నిబంధనలు ఏవి?

కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను పట్టి పీడిస్తోంది. మరోవైపు పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం.. కొవిడ్​ నిబంధనల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో థర్మల్‌ స్కానర్లు పని చేయటం లేదు. పిల్లల మధ్య భౌతిక దూరం ఉండటం లేదు.

corona rules
కొవిడ్​ నిబంధనలు

కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామంటూ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అత్యధిక పాఠశాలల్లో కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. ఒక బెంచీపై ఒక విద్యార్థినే కూర్చోబెట్టాలనే నిబంధన ఎక్కడా అమలు జరగడం లేదు. ఒక్కో బెంచీపై ముగ్గురు, నలుగురు కూడా కూర్చుంటున్నారు. శానిటైజర్‌ బాటిళ్లు ఎక్కడో ఒకటీ అరా అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు మాస్కులు తెచ్చుకుంటున్నప్పటికీ.. సగం మంది కూడా ధరించడం లేదు’.

బెంచీకి ముగ్గురు.. నలుగురు

రగతి గదిలో ఉన్న విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాఠించేలా చూడాలని పాఠశాలలు తెరిచిన సమయంలోనే విద్యాశాఖ అధికారులు స్పష్టంగా సూచించారు. కానీ.. చాలా పాఠశాలల్లో అసలు తరగతి గదిలో కొవిడ్‌ నిబంధనలు అమలు జరగడం లేదు. 90శాతం పాఠశాలల్లో ఎక్కడా బెంచీకి ఒకరు చొప్పున కూర్చునే పద్ధతే పాటించడం లేదు. బెంచీకి ఇద్దరి నుంచి ముగ్గురు, కొన్నిచోట్ల నలుగురిని కూడా కూర్చోబెడుతున్నారు. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులను చాలాచోట్ల కలిపే కూర్చోబెడుతున్నారు. పాఠశాలలకు తరగతి గదుల కొరత ఉండడంతో ఉన్న ఒకటి రెండు గదుల్లోనే అందరినీ కూర్చోబెడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో రెండేసి తరగతులను కలిపి ఒకే గదిలో ఉంచుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం ఎక్కడో ఓచోట కరోనా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులు కొవిడ్‌ బారినపడుతున్నారు. మూడు రోజుల కిందట ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు ఉన్నత పాఠశాలలో ఒకేసారి నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరి తల్లిదండ్రులు ఇద్దరు కొవిడ్‌ బారినపడ్డారు. ఇదే పాఠశాలకు టీసీల కోసం వచ్చిన మరో నలుగురు కళాశాల విద్యార్థులు కూడా వైరస్‌ బారినపడ్డారు. తాజాగా శుక్రవారం కూడా పలు పాఠశాలల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులొచ్చాయి. పమిడి ముక్కల మండలంలోని ఆగినపర్రులో ఒకటి, పామర్రు మండలం జమీదగ్గుమిల్లిలో ఒకటి, నందివాడ మండలం తమిరశలో ఒకటి, శంకరంపాడులో ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం సహా గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కలిపి 100 ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఈనాడు, న్యూస్‌టుడే’ బృందం శుక్రవారం పరిశీలించింది. చాలా పాఠశాలల్లో కొవిడ్‌కు సంబంధించిన ప్రాథమిక నిబంధనలు కూడా పాటించడం లేదని తేలింది.

మధ్యాహ్న భోజనం గందరగోళం..

పాఠశాలల్లో విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం సమయంలో గుమిగూడి, దగ్గరి దగ్గరగా కూర్చుని తింటున్నారు. 80శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. ఇక్కడే వైరస్‌ వ్యాప్తి అధికంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. పాఠశాల వరండాల్లోనూ పక్కపక్కనే కూర్చుని తింటున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున.. ఖచ్చితంగా ఈ విషయంపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలన్నింటిలోనూ ఉదయం వేళ మాత్రం తప్పనిసరిగా తరగతి గదిని శానిటైజ్‌ చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం మరోసారి శానిటైజ్‌ చేస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల వద్ద కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు పరికరాలు, పెనాయిల్‌ లాంటివి ఇచ్చారు. దీంతో పాఠశాలల్లో పనిచేసే స్వీపర్లతో మూత్రశాలలు, మరుగుదొడ్లను మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు.

థర్మల్‌స్కానింగ్‌, శానిటైజర్లు ఎక్కడ..

జిల్లాలోని 70శాతం పాఠశాలల్లో అసలు థర్మల్‌ స్కానింగ్‌ చేసే యంత్రాలే లేవు. కొన్ని పాఠశాలల్లో ఉన్నా.. అవి పనిచేయడం లేదు. వందల మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే థర్మల్‌ స్కానర్లు ఉన్నాయి. అవికూడా నామమాత్రంగానే మారాయి. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌లో ఉన్న డీఎస్‌ఎం హైస్కూల్‌లో 600మంది విద్యార్థులుంటే ఒకే ఒక్క థర్మల్‌ గన్‌ ఉంది. ఈ పాఠశాలలో బెంచీకి ముగ్గురు చొప్పున కూర్చుంటున్నారు. మైలవరంలోని ఎంపీపీ స్కూల్‌లో ఉన్నవే రెండు గదులు, దీంతో మూడేసి తరగతులను కలిపి ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. ఇలాగే జిల్లాలోని చాలా పాఠశాలల్లో పరిస్థితి ఉంది. శానిటైజర్లను 90శాతం పాఠశాలల్లో అందుబాటులో ఉంచడమే లేదు. ఎక్కడో ఒక్కొక్క పాఠశాలలో మాత్రమే శానిటైజర్లు ఉంచుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులే తెచ్చుకుంటున్నారు.

మాస్కులు సగం మందే..

విద్యార్థులంతా మాస్కులు తెచ్చుకుంటున్నా.. సగం మంది కూడా వాటిని ధరించడం లేదు. అసలు వాటిని ధరించాలంటూ ఉపాధ్యాయులే చెప్పడం లేదు. దీంతో ఒక పాఠశాలలో విద్యార్థికి పాజిటివ్‌ వస్తే.. మిగతా వారంతా ప్రమాదంలో పడుతున్నారు. విజయవాడలోని కర్నాటి రామ్మోహనరావు నగరపాలక సంస్థ పాఠశాలలో 344మంది విద్యార్థులు చదువుతుండగా.. శుక్రవారం 202మంది హాజరయ్యారు. వీరిలో 184మంది దగ్గర మాస్కులున్నాయి. కానీ.. చాలామంది విద్యార్థులు సరిగా ధరించడం లేదు. తరగతిలో ఉన్నంత వరకు మాస్కులు ధరిస్తూ కూర్చోవడం కష్టంగా ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ.. భౌతికదూరం పాటించకుండా కూర్చోబెడుతుండడంతో మాస్కులు ధరించడం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండీ.. GANGAVARAM: 'గంగవరం నౌకాశ్రయం వాటా విక్రయం అవివేకమే'

ABOUT THE AUTHOR

...view details